కూరగాయల సాగుతో లాభాలు


వికారాబాద్: దేశంలోనే జిల్లాలోని భూములు పండ్ల తోటలు, కూరగాయల పెంపకానికి అనువుగా ఉన్నాయని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని కొత్తగడి గ్రామంలో ఉత్తమ రైతు మోహన్‌రెడ్డి వ్యవసాయక్షేత్రంలో ఏర్పాటు చేసిన ‘మన ఊరు- మన  కూరగాయలు’ రైతు శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లా రైతులు పండ్లు, కూరగాయల తోటల పెంపకంపై దృష్టి పెట్టాలని, మంచి లాభాలు పొందాలని సూచించారు.



హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌కు 80 శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయన్నారు. జిల్లా రైతులకు కూరగాయల సాగుపై అవగాహన పెంచాలని  అన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న వారి అవసరాలకు రోజుకు 25 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరమని, తెలంగాణ వ్యాప్తంగా కేవలం లక్ష మెట్రిక్ టన్నుల కూరగాయలే పండిస్తున్నారని అన్నారు. మిగతావన్నీ ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి అవుతున్నాయన్నారు.



రైతుల వద్దకే వచ్చి కూరగాయలు కొనే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. మామిడి, జామ పండ్ల తోటల్లో శాస్త్రీయ పద్ధతుల్లో అంటుకట్టి ఉత్పత్తులను పెంచడానికి ప్రభుత్వం అన్ని రకాల పద్ధతులను అవలంబిస్తున్నదన్నారు. వికారాబాద్ వ్యవసాయ ఉద్యాన  క్షేత్రం నుంచి యేటా 5 లక్షల మొక్కలను అంటు కట్టి తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. అంతకుముందు పట్టణంలోని ఉద్యాన వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరావు, ఉద్యావన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సబ్ కలెక్టర్ హరినారాయణ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top