కల్తీ దందా

కల్తీ దందా - Sakshi


► నీళ్లు, స్పిరిట్‌ కలిపి మద్యాన్ని కల్తీ చేస్తున్న వ్యాపారులు  

► ఇప్పటికే పలు కేసులు నమోదు  ∙ఆందోళనలో మందుబాబులు

► పట్టించుకోని ఎక్సైజ్‌శాఖ అధికారులు




సిర్పూర్‌(టి) :

జిల్లాలోని సిర్పూర్‌ నియోజకవర్గంలో కల్తీ మద్యం ఏరులైపారుతోంది. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు మద్యాన్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మద్యంలో నీళ్లు, స్పిరిట్‌ కలిపి కల్తీ చేస్తున్నారు. గతంలో కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లో కల్తీ మద్యం తయారు చేసిన బాటిళ్లలో స్పిరిట్‌ కలిపినట్లు తేలడంతో సిర్పూర్‌ నియోజకవర్గ ప్రజలు ఆందోళనకు  గురవుతున్నారు. తరుచూ అధికారుల దాడుల్లో లూజ్‌ విక్రయాలు జరుగుతున్నట్లు తేలడంతో కల్తీ మద్యంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు కొందరు ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోవడం లేదు.



దీంతో జిల్లా ఉన్నతాధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌పోర్స్‌ హైదరాబాద్‌ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేస్తే కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూళ్ల మత్తులో పడి ఎక్సైజ్‌ అధికారులు పర్యవేక్షణ చేయడం లేదనే  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిర్పూర్‌ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్, దహెగాం మండలాల్లో ఇది వరకే కల్తీ మద్యం లభించడంతో పలు కేసులు నమోదయ్యాయి. అయినా  పలు మద్యం దుకాణాల్లో లూజ్‌  విక్రయాలు, అక్రమ రవాణా నిలిపివేయడంలో అధికారులు విఫలమవుతున్నారు.



మచ్చుకు కొన్ని సంఘటలు..

గతంలో కాగజ్‌నగర్‌ పట్టణంలోని కాపువాడలో అధికారులు చేసిన దాడుల్లో ఓ ఇంటిలో ఉన్న కల్తీ మద్యం తయారు చేసే పరికరాలు, ఖాళీ బాటిళ్లు, బాటిళ్లకు అమర్చే మూతలు చూసి నివ్వెరపోయారు. ఆ ఇంటిలో బాటిళ్లకు అమర్చే 15వేల మూతలు, 5వేల ఖాళీ బాటిళ్లు, 8 కాటన్ల మద్యం లభించింది. ఇంటిలో కల్తీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిపై కేసులు కూడా నమోదు చేశారు. దీనికి ముందు దహెగాం మండలంలోని ఓ వ్యాపారి కల్తీ మద్యం విక్రయిస్తుండగా పట్టుబడటంతో కేసు నమోదైంది.



అలాగే కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఓ వైన్‌షాపులో లూజ్‌ విక్రయాలు జరుపుతుండటంతో కేసు నమోదు చేశారు. సిర్పూర్‌(టి)లోని మద్యం షాపులో గతంలో అదిక ధరలు, లూజ్‌ విక్రయాలు చేస్తుండగా అధికారులకు పట్టుబడటంతో కేసులు నమోదు చేశారు. పదిహేను రోజుల క్రితం తిరిగి కల్తీ మద్యం, లూజ్‌ విక్రయాలు జరుపుతున్నారని గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించి షాపుసీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. షాపులోని 12లూజ్‌ బాటిళ్లను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. లూస్‌ విక్రయాలు చేసినందుకు రూ.5లక్షల జరిమానా విధించారు.



మహారాష్ట్రకు రవాణా..

మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాల్లో మద్య నిషేధం ఉండటంతో మహారాష్ట్రలోని పలు పట్టణాలు,, గ్రామాలకు మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఈ రెండు జిల్లాలు నియోజకవర్గంలోని సిర్పూర్‌(టి), కౌటాల, బెజ్జూర్‌ మండలాలకు ఆనుకోని ఉండటంతో మద్యం అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. అలాగే కాగజ్‌నగర్‌ పట్టణం నుంచి రామగిరి ప్యాసింజర్, నాగ్‌పూర్‌ ప్యాసింజర్, భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా రాత్రి సమయాల్లో మహారాష్ట్రకు మద్యం రవాణా చేస్తున్నారు. రైళ్లలో అప్పుడప్పుడు చేసిన తనిఖీలలో మద్యం రవాణాదారులు మద్యం వదిలి వెళ్లడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  



సిర్పూర్‌(టి)–మాకిడి అంతర్రాష్ట్ర రోడ్డు గుండా ప్రతీరోజు మద్యం అక్రమ రవాణా చేస్తుండటంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి మద్యం రవాణా చేస్తున్న వాహనాలు సీజ్‌ చేసి పలు సార్లు కేసులు నమోదు చేశారు. అడపాదడపా ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా అక్రమ రవాణాను అడ్డుకోవంలో విఫలమవుతున్నారు. అలాగే కౌటాల, బెజ్జూర్‌ మండలాల నుంచి సమీపంలో ఉన్న పెన్‌గంగ, ప్రాణహిత నదులను దాటిస్తూ మహారాష్ట్రకు మద్యం రవాణా చేస్తున్నారు. కౌటాల మండలంలో సైతం పలుమార్లు అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు. మద్యం షాపుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులు స్పందించి కల్తీ మద్యం జరగకుండా చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



చర్యలు తీసుకుంటాం

మద్యం అక్రమరవాణా, కల్తీ మద్యం, లూజ్‌ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించి సిర్పూర్‌(టి) షాపులో లూజ్‌ విక్రయాలు చేస్తుండటంతో షాపును సీజ్‌ చేసి రూ.5లక్షల జరిమానా విధించాం.– మంగమ్మ, ఎక్సైజ్‌ సీఐ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top