కస్టడీలోకి విజిలెన్స్ అధికారి భాస్కర్రావు!
పిటిషన్ వేసే దిశగా ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విజిలెన్స్ రీజనల్ ఆఫీసర్ భాస్కర్రావును కస్టడీకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. వరంగల్లోని భాస్కర్రావు నివాసంలో దొరికిన పిస్టోల్ విషయంలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
లైసెన్స్ పొందిన ఆయుధాన్ని తన ఇంట్లో కాకుండా వరంగల్లోని అత్తగారింట్లో పెట్టడంపై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. అలాగే భాస్కర్రావు ఇంట్లో లభించిన విదేశీ మద్యం బాటిళ్లపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. భాస్కర్రావుకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, లాకర్లను పరిశీలించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం భాస్కర్రావును కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. సోమవారం కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి లాకర్లు తెరిపించడం, గన్ లైసెన్స్ వెరిఫికేషన్, విదేశీ మద్యం బాటిళ్లు తదితర విషయాలపై ఆరా తీయాలని ఏసీబీ అధికారులు యోచిస్తున్నారు.