ఏసీబీకి చిక్కిన వీఆర్వో
నిజామాబాద్ : పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేరు మార్చడానికి రూ.3 వేలు లంచం డిమాండ్ చేసిన వీఆర్వో ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఘన్పూర్ గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న ముత్తన్న.. అక్కాపూర్ గ్రామానికి చెందిన బేజి ఎల్లయ్య భూమికి చెందిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేరు మార్చడానికి రూ.3వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఎల్లయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీఆర్వోను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అదనపు సమాచారం కోసం అతన్ని విచారిస్తున్నారు.