ఏసీబీ వలలో చిన్నచేప


వంగూరు : ఓ రైతు తన భూమికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్ ఇవ్వాలని అడిగితే అందుకు వీఆర్‌ఓ లంచం డిమాండ్ చేశారు. కడుపుమండిన బాధిత రైతు జిల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. చివరకు వీఆర్‌ఓ ఏసీబీ వలలో చిక్కాడు. వివరాలిలా ఉన్నాయి. వంగూరు మండలం ఉమ్మాపూర్ వీఆర్‌ఓ కావలి భీమన్న నిజాంబాద్, గాజరకు ఇన్‌చార్జిగానూ వ్యవహరిస్తున్నారు.

 

  నిజాంబాద్‌కు చెందిన చాంద్‌పాషాకు శివారులోని సర్వేనం.46, 47లో తనకున్న 8.22 ఎకరాల భూమి ఉంది. దీనిని తన కొడుకులు మసూద్ పేరిట 4.09 ఎకరాలు, యూసుఫ్‌కు 4.13 ఎకరాలు మార్చాలని 2012లో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుక నుగుణంగా 2013 ఏప్రిల్ 15న ప్రొసీడింగ్ జారీ చేశారు.

 

 అప్పటి నుంచి పాసుపుస్తకాలు, టైటిల్ లీడ్స్ కోసం తిరుగుతున్నారు. అయితే వీఆర్‌ఓ భీమన్న మాత్రం *పది వేల లంచం ఇస్తేనే పాసుపుస్తకాలు ఇస్తానని వేధించసాగాడు. ఎట్టకేలకు పెద్ద కొడుకు మసూద్ *ఐదు వేలు ఇస్తానని అంగీకరించి ఈనెల 25న జిల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వంగూరులోని వీఆర్‌ఓ ఇంటికి వెళ్లి *డబ్బులు ఇస్తుండగా దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద ఉన్న పాసుపుస్తకాలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేశారు.



అనంతరం విలేకరులతో ఏసీబీ డీఎస్పీ రాందాస్‌తేజ మాట్లాడుతూ లంచం తీసుకుంటున్న వీఆర్‌ఓ భీమన్నను అదుపులోకి తీసుకున్నామన్నారు. పాసుపుస్తకాలకు సంబంధించిన రెవెన్యూ రికార్డులన్నింటినీ సేకరించి శనివారం హైదరాబాద్ ఏసీబీ కోర్టులో నిందితుడిని హాజరుపర్చనున్నామన్నారు. కార్యక్రమంలో సీఐ గోవింద్‌రెడ్డి, సిబ్బంది కొండారెడ్డి, జగదీష్, శివ, సంపత్, అరుణ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top