శ్రీకాంత్ కిడ్నాప్ కథ సుఖాంతం
♦ 14 రోజుల తర్వాత యూపీలో ఆచూకీ
♦ ముజఫర్నగర్ సమీపంలో కిడ్నాపర్ల అరెస్టు
♦ గురువారం ఢిల్లీకి చేరుకోనున్న శ్రీకాంత్
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, గద్వాల/గద్వాల క్రైం: క్యాబ్ డ్రైవర్ చేతిలో ఢిల్లీలో అపహరణకు గురైన వైద్య విద్యార్థి శ్రీకాంత్గౌడ్ క్షేమంగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. యూపీలో శ్రీకాంత్ ఆచూకీ లభించిందని, గురువారం ఉదయంలోగా ఢిల్లీకి తీసుకొస్తా మని తెలిపారు. వివరాలను ఏసీపీ రాహుల్ మీడియాకు వెల్లడించారు. నేర చరిత గల ఓ ముఠా పక్కా ప్రణాళిక ప్రకారమే శ్రీకాంత్ను కిడ్నాప్ చేసిందని వెల్లడించారు. ప్రత్యేక బృందాలు ముఠాను వెంటాడినట్లు తెలిపా రు. శ్రీకాంత్ను కిడ్నాప్ చేసిన క్యాబ్ డ్రైవర్ ఉత్తరప్రదేశ్ నోయిడా సమీపంలోని దాద్రిలో ముఠాలోని మిగిలిన సభ్యులను కలిశాడని వివరించారు. అనంతరం అపహరించినట్లు శ్రీకాంత్ మొబైల్లో ఫొటోలు తీసి ఓలా యాజమాన్యానికి పంపారని తెలిపారు.
సినీ ఫక్కీలో చేజింగ్..
శ్రీకాంత్ ఆచూకీ కోసం వెతుకుతుండగా ఆది వారం యూపీ పోలీసులు, ఢిల్లీ పోలీసులకు కిడ్నాప్ ముఠా మీరట్లో తారసపడగా ఎదు రుకాల్పులు చోటుచేసుకున్నాయని, అయితే వారు తప్పించుకున్నారని చెప్పారు. బుధవా రం ముజఫర్నగర్ సమీపంలో ఎదురుపడ గా, మరోసారి కాల్పులు జరిగాయన్నారు. చివరికి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శ్రీకాంత్ క్షేమంగా ఉన్నాడని, గురువారం ఉదయం ఢిల్లీకి తీసుకొస్తామని వివరించారు. కాగా, శ్రీకాంత్తో ఫోన్లో మాట్లాడానని ఢిల్లీలో ఉన్న శ్రీకాంత్ బాబాయి నారాయణగౌడ్ చెప్పాడు. శ్రీకాంత్ క్షేమంగా బయటపడటం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ పోలీసుల వద్ద ఉన్న శ్రీకాంత్తో మాట్లాడినట్లు తండ్రి జనార్దన్గౌడ్ తెలిపాడు.
ఆనందంలో తల్లిదండ్రులు..
శ్రీకాంత్ క్షేమంగా ఉండటంతో గద్వాల మొమిన్మెహల్లాలోని అతడి ఇంటి వద్ద ఆనందం వెల్లివిరిసింది. కుటుంబ సభ్యులు, కాలనీవాసులు మిఠాయిలు పంచుకున్నారు. శ్రీకాంత్ క్షేమంగా ఉన్నాడన్న సమాచారం అందుకున్న ఎమ్మెల్యే డీ.కే.అరుణ శ్రీకాంత్ కుటుంబ సభ్యులను కలిశారు. తల్లిదండ్రులకు స్వీట్లు తినిపించి ఆనందం పంచుకున్నారు. ఎంపీ నంది ఎల్లయ్య సహకారంతో ఢిల్లీ పోలీసులతో ఎప్పటికప్పుడు మాట్లాడి శ్రీకాంత్ వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు.