అభాగ్యురాలు
- శీలానికి వెలకట్టిన పెద్దలు..
- అబార్షన్ చేయించిన నిందితుడి తల్లి
- రెండు నెలల తర్వాత మృతి
కల్లూరు రూరల్ (సత్తుపల్లి): మోసగాడి మాయమాటల్లో పడి గర్భవతైంది. పెద్దలు ఆమె శీలానికి వెలకట్టి వదిలేశారు. నిందితుడి తల్లి దగ్గరుండి మరీ అబార్షన్ చేయించింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యంపై నిరుపేదలైన తల్లిదండ్రులు పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. దీంతో రెండు నెలల తర్వాత శుక్రవారం ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, 12 మందిపై కేసు పెట్టారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబంజరకు చెందిన వికలాంగురాలు వాంకుడోత్ రాణి(15)కి, అదే గ్రామానికి చెందిన మూడు చెన్న కేశవులు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. గర్భం దాల్చడంతో ఆమె తల్లిదండ్రులు గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో బాధితురాలిని చెన్నకేశవులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.
దీనికి అతడి తల్లిదండ్రులు నిరాకరించి, నష్ట పరిహారం చెల్లించేందుకు సిద్ధపడ్డారు. బాలిక కుటుంబానికి రూ.40 వేలు చెల్లించేలా గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో చెన్నకేశవులు తల్లి మూడు లచ్చి.. బాధితురాలికి ఖమ్మం తీసుకెళ్లి అబార్షన్ చేయించింది నిరుపేదలైన బాలిక తల్లిదండ్రులు వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోలేదు. ఆమె ఆరోగ్యం క్షీణించి, ఖమ్మం ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి మృతిచెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో శనివారం 12 మందిపై కల్లూరు కేసు నమోదు చేశారు. అబార్షన్ చేసిన ఆస్పత్రి వైద్యులపై కూడా చర్యలు తీసుకోనున్నారు.