కూతురు లవ్ మ్యారేజ్.. తల్లి ఆత్మహత్య
సిరిసిల్ల : కూతురు ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపంతో ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గున్నాల కిరణ్, ర్యాకం తిరుమల అనే యువతిని శుక్రవారం ఉదయం ప్రేమవివాహం చేసుకున్నాడు. దీంతో కూతురు తిరుమల కులాంతర వివాహం చేసుకుందని మనస్తాపానికి లోనైన ఆమె తల్లి శోభ(40) ఇంట్లో ఉన్న యాసిడ్ తాగింది.
ఇది గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం శోభను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్సపొందుతూ కాసేపటికే ఆమె మృతిచెందింది. శోభ మృతదేహంతో ఆమె బంధువులు గున్నాల కిరణ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వారిని వారించే యత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.