చేతబడి నెపంతో దాడి.. మహిళ మృతి
మొయిన్పేట : చేతబడి చేస్తున్నాడనే నేపంతో ఓ కుటుంబంపై జరిగిన దాడిలో ఓ మహిళ మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా మొయిన్ పేట మండలం వెల్చాల్లో మంగళవారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... వెల్చాల్ గ్రామానికి చెందిన మొగులమ్మ(55) తన భర్త బిచ్చన్న(58), కుమారుడు నరహరితో కలిసి ఉంటోంది. వీరి కుటుంబం చేతబడి చేస్తున్నారని అనుమానం పెంచుకున్న గ్రామస్తులు పలు మార్లు మొగులమ్మ కుటుంబంతో గొడవకు దిగారు.
అయితే సోమవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన కొత్త బాలయ్య, లక్ష్మయ్య, రమేష్, అచ్చయ్యలు మొగులమ్మ కుటుంబంపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మొగులమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన ఆమె భర్త, కుమారుడు లను స్తానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.