70 వేల రియాళ్లు చెల్లిస్తేనే ఇంటికి...


- సౌదీ కోర్టు కేసులో ఏర్గట్లవాసులు

- క్షమాభిక్ష సందర్భంగా ఇంటికి వచ్చే యత్నం

 

మోర్తాడ్‌ (బాల్కొండ): సౌదీలో కోర్టు కేసును ఎదుర్కొంటున్న నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలానికి చెందిన ఐదుగురు ఇంటికి రావాలంటే.. 70 వేల రియాళ్ల జరిమానా చెల్లిం చాల్సిందేనని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ జరిమానా చెల్లిస్తేనే కేసు వెనక్కి తీసుకుంటామని కంపెనీ యాజమాన్యం చెప్పడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఏర్గట్లకు చెందిన జక్కని తిరుపతి, తలారి రామ్‌దాస్, దండబోయిన చిన్న బొర్రన్న, సారంగి సాయన్న, గుమ్మిర్యాల్‌కు చెందిన ఎం. రాజులు 2013లో సౌదీలోని ఓ కంపెనీలో పని చేసేందుకు వెళ్లారు. వీరికి వీసాలిచ్చిన కంపెనీ పనిలో చేరిన తర్వాత ఒప్పందాలను ఉల్లంఘించింది. దీంతో కార్మికులు కంపెనీ నుంచి బయటకు వచ్చేసి.. పనులు చేసుకుంటున్నారు. దీంతో కంపెనీ యాజమాన్యం వీరిపై కేసులు పెట్టింది.



తాజాగా, సౌదీ ప్రభుత్వం అక్కడ అక్రమంగా ఉంటున్న వారు నేరుగా స్వగ్రామాలకు వెళ్లేందుకు అనువుగా క్షమాభిక్ష ప్రకటించింది. ఈ నెల 29న ఈ గడువు ముగుస్తుంది.  ఏర్గట్లకు చెందిన ఐదుగురు సైతం స్వగ్రామాలకు వచ్చేందుకు అక్కడి మన విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించారు. వారిపై సౌదీలో కేసులు నమోదై ఉన్నందుకు ఔట్‌ పాస్‌పోర్టులు జారీ చేయడం సాధ్యం కాదని, కేసుల విషయం తేల్చుకోవాలని సూచించారు. దీంతో కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదించగా.. తమకు 70 వేల రియాళ్లు (మన కరెన్సీలో రూ. 15 లక్షల నుంచి రూ. 18 లక్షలు) జరి మానా చెల్లిస్తే.. పాస్‌పోస్టులు ఇస్తామని స్పష్టం చేసింది. కంపెనీలో సరిగా పనిలేకపోవడం  వల్లే తాము బయటకు వచ్చామని కార్మికులు చెబుతున్నా.. వారి వాదనను వినేవారే లేకుండా పోయారు. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి తమను స్వగ్రామానికి చేర్చాలని వారు కోరుతున్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top