8 రోజులు.. 8 బోర్లు..
- ఘొల్లుమన్న గొండ స్వామి
మెదక్ రూరల్: మెదక్ మండలం గుట్టకింది పల్లిలో ఎకరంన్నర భూమి ఉన్న ఓ రైతు వారం వ్యవధిలో ఎనిమిది బోర్లు తవ్వించాడు. చుక్కనీరు రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. గ్రామానికి చెందిన గొండ స్వామి భార్యతో కలసి గత ఏడాది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు వలస వెళ్లారు. ఏడాదిపాటు జీతం ఉండి సుమారు రూ.లక్ష సంపాదించి ఇటీవల గ్రామానికి వచ్చారు. తనకున్న ఎకరంన్నర పొలంలో బోరు వేసి వ్యవసాయం చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో బోర్లు వేయడం ప్రారంభించాడు.
వారం రోజుల వ్యవధిలో 350 నుంచి 400 అడుగుల లోతు ఎనిమిది బోర్లు తవ్విం చాడు. ఒక్కదాంట్లో మాత్రమే కొద్దిపాటి నీరు వచ్చింది. నీరొచ్చిందనే ఆశతో రూ.40 వేలు అప్పు చేసి మోటార్ బిగించగా చుక్కనీరు కూడా రావటంలేదు. బోర్లు, మోటార్కు రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేశానని రైతు స్వామి బోరుమంటున్నాడు. తన పొలాన్ని అమ్మినా అప్పు తీరే పరిస్థితి లేదని వాపోతున్నాడు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమంటున్నాడు. గ్రామానికి చెందిన గొల్ల శంకరయ్య, గొల్ల మల్లేశం కూడా నెలరోజుల వ్యవధిలో నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు.