విషప్రయోగంతో ఆరు నెమళ్లు మృతి
దుబ్బాక: గుర్తుతెలియని దుండగులు పెట్టిన విషాహారాన్ని తిని ఆరు నెమళ్లు మరణించాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం చీకోడు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. చీకోడు గ్రామానికి చెందిన ఈతవనం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన విషాహారాన్ని తిన్న పది నెమళ్లు తీవ్ర అస్వస్థతకు గురై కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని అటుగా వెళుతున్న గీత కార్మికులు గుర్తించారు.
వెంటనే వారు నెమళ్లకు నీటిని తాగించి సపర్యలు చేసి రక్షించే ప్రయత్నం చేశారు. దాంతో నాలుగింటిని కాపాడగలిగారు, కానీ మరో ఆరు నెమళ్లు చనిపోయాయి. రక్షించిన నెమళ్లను స్థానిక ఈత వనంలోకి వదిలి పెట్టారు. కాగా నెమళ్లకు విషం పెట్టి హత్య చేస్తున్న వేటగాళ్లపై అటవీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గీత కార్మికులు దబ్బెడ రామ స్వామి గౌడ్, దొడ్ల కిషన్ గౌడ్, గడ్డం సత్యనారాయణ గౌడ్, కాసారం పాండు, దబ్బెడ శ్రీనివాస్ గౌడ్, దొడ్ల నరసింహులు, గడ్డం నరసింహులు గౌడ్ లు కోరారు.