విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు
ఖమ్మం : ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయిన ఓ షిఫ్టు కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని డీకొట్టడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఎస్ఐ తాటిపాముల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... గార్ల మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు షిఫ్టు కారులో పాల్వంచలోని పెద్దమ్మతల్లిని దర్శించుకుని ఆదివారం తిరుగు ప్రయాణం అయ్యారు.
టేకులపల్లి మండలం సులానగర్ - సీతారంపురం గ్రామాల మధ్యకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని వేగంగా డీకొట్టారు. ఈ ఘటనలో కారు బోల్తా పడి నుజ్జు నుజ్జయింది. సంఘటనా స్థలంలో క్షతగాత్రులను స్థానికులు కారు నుంచి బయటకు తీసి 108 వాహనంలో కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.