వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి


రుద్రంపూర్: ఖమ్మం జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని రుద్రంపూర్ మండలం రామవరంలో నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ లారీని దుకాణాలపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో దుకాణం వద్ద కాపలాగా ఉన్న వ్యక్తి మృతి చెందాడు. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన లారీ బుధవారం రాత్రి ఆయిల్ లోడుతో రామవరం చేరుకుంది. తెల్లవారుజామున అన్‌లోడ్ అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ రోడ్డు పక్కనున్న దుకాణాలపైకి పోనిచ్చాడు. లారీ ఢీకొట్టంతో ఒక దుకాణం బీమ్ విరిగి అక్కడే పడుకున్న కాపలాదారు లక్ష్మీనారాయణ(54)పై పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.



లారీ పైనుంచి పడి..

వైరా: లారీ లోడుపై నిద్రిస్తున్న ఒక వ్యక్తి నిద్రలో దొర్లి కిందపడి చనిపోయాడు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ జిల్లాలోని వైరా పట్టణం మార్కెట్ యార్డు సమీపంలో బుధవారం రాత్రి ఆగింది. లారీ డ్రైవర్ లోడుపైకి ఎక్కి నిద్రిస్తున్నాడు. తెల్లవారు జామున గాఢ నిద్రలో ఉన్న అతడు పైనుంచి కిందపడిపోయాడు. తలకు తీవ్రంగా దెబ్బతగలటంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.



రెండు లారీలు ఢీకొని..

కల్లూరు:  జిల్లాలోని కల్లూరు మండలం రామకృష్ణాపూర్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీలు ఢీకొట్టిన ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే చనిపోయారు. మొక్కజొన్నల లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ, ఎదురుగా సత్తుపల్లి వైపు వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. రెండు లారీల్లోనూ డ్రైవర్లు మాత్రమే ఉండటంతో వారి వివరాలు తెలియ రాలేదు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top