30 రోజుల్లో 25 పరిశ్రమలకు అనుమతులు
మేక్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం పెట్టుబడులకు రాచమార్గంగా మారిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సింగిల్ విండో విధానంతో నెలరోజుల్లోనే అనుమతులు మం జూరు చేసే విధానం కేవలం తెలంగాణలోనే సాధ్యమైందన్నారు. ఫ్టాప్సీ ఆధ్వర్యంలో ‘మేక్ ఇన్ ఇండియా- అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై జరుగుతున్న జాతీయ సెమినార్ రెండో రోజు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఐపాస్ విధాన ంతో నెల రోజులలోపే పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం వల్ల వేల కోట్ల పెట్టుబడులతో బడా కంపెనీలు వస్తున్నాయన్నారు. ఎంఆర్ఎఫ్ కంపెనీకి 10 రోజుల్లో, అమెజాన్ కంపెనీకి 11 రోజుల్లో అనుమతులు లభించినట్లు చెప్పారు.
ఈ తరహా 30 రోజుల్లోపు 25 భారీ పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ లోటును అధిగమించేందుకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.200 కోట్ల నిధులను కేటాయించినట్లు చెప్పారు. వచ్చే జనవరిలో ప్రపంచస్థాయి పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. హోం మంత్రి నాయిని మాట్లాడుతూ.. జపాన్, యూరప్, అమెరికా దేశాల నుంచి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, ఫ్టాప్సీ అధ్యక్షుడు శివకుమార్ రుంగ్టా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి వెన్నం పాల్గొన్నారు.