రెండు లారీలు ఢీకొని ఇద్దరి మృతి
మహబూబ్నగర్ (అడ్డాకుల): ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అడ్డాకుల మండలంలోని శాఖాపూర్ టోల్ప్లాజా వద్ద జరిగింది. వివరాలు.. హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న వోల్వో బస్సు శాఖాపూర్ టోల్ప్లాజాకు కొద్ది దూరంలో ఆగి ఉంది. దీని వెనకాలే అటుగా వెళ్తున్న మరో లారీ పార్క్ చేశారు.
ఈ లారీ, బస్సు మధ్య వోల్వో బస్సు డ్రైవర్ చంద్రమోహన్, లారీ క్లీనర్ మాట్లాడుకుంటున్నారు. ఇది గమనించని మరో లారీ డ్రైవర్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో లారీ, బస్ మధ్య ఉన్న ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు. ఢీకొట్టిన లారీలో ఉన్న వాళ్లకు కూడా తీవ్రగాయాలయ్యాయి. లారీ వెళ్తూ ఉందని పొరబడటమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.