వడదెబ్బతో 17మంది మృతి

వడదెబ్బతో 17మంది మృతి


జిల్లాలో రోజురోజుకూ ఎండలు ముదిరిపోతున్నాయి. ప్రచంఢ భానుడు తన ప్రతాపం చూపుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. 45 డిగ్రీల సెంటీగ్రేడ్‌ను మించి ఎండ తీవ్రత ఉంటుండటంతో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు దాటే వరకు బయట తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో వడదెబ్బకు గురై  మృత్యువాతపడుతున్నారు.. తాజాగా ఆదివారం ఒక్కరోజే 17మంది చనిపోయారు..

 

 జడ్చర్ల : బాదేపల్లి పట్టణంలోని హనుమాన్‌వీధికి చెందిన మహ్మద్ షబ్బీర్ (45) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈయనకు భార్య సాబెరాబేగంతో పాటు ముగ్గురు పిల్లలున్నారు. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి రాగా ఎండల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిసేపటికే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు.



 ధన్వాడ : మండలంలోని మరికల్‌కు చెందిన కంచారి వేణుగోపాల్ (48) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపుడుతున్నాడు. చివరకు ఆదివారం మధ్యాహ్నం ఎండల తీవ్రతకు తట్టుకోలేక ఇంట్లోనే ప్రాణాలు వదిలాడు. ఈయన కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఈ సంఘటనతో వారు కన్నీరు మున్నీరయ్యారు.



 ఉపాధిహామీ కూలీ..

 కోయిల్‌కొండ : మండలంలోని పెర్కివీడ్‌తండాకు చెందిన దేవుజానాయక్ (65) ఉపాధి హామీ పథకంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం ఉదయం పనికి వె ళ్లగా వడదెబ్బ సోకడంతో సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. అస్వస్థతకు గురై అర్ధరాత్రి ఇంట్లోనే మృతి చెందాడు. ఆదివార ఉదయం బాధిత కుటుంబాన్ని సర్పంచ్ దన్‌పాల్‌రెడ్డి, స్థానిక నాయకులు జైపాల్‌రెడ్డి, శేఖర్ పరామర్శించారు.

 గట్టు : మండలంలోని గొర్లఖాన్‌దొడ్డికి చెందిన ఖానాపూర్ తిప్పయ్య (67) శనివారం ఉదయం మల్దకల్‌లో నిర్వహించే సంతకు వెళ్లాడు. రాత్రి వరకు అక్కడే ఉండి ఆదివారం ఉదయం స్వగ్రామానికి చేరుకున్నాడు. అప్పటికే వడదెబ్బతో అస్వస్థకు గురికాగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అయిజ ప్రభుత్వ ఆస్పత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈయనకు భార్య బుడ్డమ్మతో పాటు కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.



 వనపర్తి టౌన్:పట్టణంలోని పాతబజార్‌కు చెం దిన ఎం.డి.గఫూర్ (67) శనివారం మధ్యాహ్నం కొత్తకోట సమీపంలోని గుంపుగట్టు వద్దకు వెళ్లాడు. అక్కడే వడదెబ్బకు గురై అదే రాత్రి ఇంటికొచ్చి నిద్రలోనే కన్నుమూశాడు. ఆదివారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులను కౌన్సిలర్లు చీర్ల విజయ్‌చందర్, వెంకటేష్; స్థానిక నాయకులు రాజు, బీసన్ పరామర్శించి *ఐదు వేలు ఆర్థికసాయం అందజేశారు.



 నవాబుపేట : మండలంలోని యన్మన్‌గండ్లకు చెందిన గుత్తే హన్మంతు (40), మైసమ్మ దంపతులది రైతు కుటుంబం. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భర్త సమీపంలోని తమ పొలంలో ఎండలోనే వ్యవసాయ పనులు చేశాడు. అనంతరం సొంత పనిమీద నవాబుపేటకు వచ్చి అర్ధరాత్రి పడుకున్న చోటే మృతి చెందాడు.  



 పాన్‌గల్ : మండలంలోని మాందాపూర్‌కు చెం దిన పుల్లయ్య (66)కు ఆదివారం మధ్యాహ్నం వడదెబ్బ సోకడంతో అస్వస్థతకు గురయ్యా డు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ప్రథమ చికిత్స నిర్వహించి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ఈయనకు భార్య శాంతమ్మతో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని సర్పంచ్ జయరాములుసాగర్ పరామర్శించారు.



 మక్తల్ : మండలంలోని ముస్లాయిపల్లికి చెందిన సౌరప్పగౌడ్ (60) శనివారం మధ్యాహ్నం సమీపంలోని తమ పొలానికి వెళ్లాడు. ఎండలోనే పనిచేసి రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆదివారం తెల్లవారుజమున మక్తల్‌కు చికిత్సకోసం తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈయనకు భార్య అనంతమ్మతో పాటు కుమారులు లక్ష్మణ్‌గౌడ్, వెంకటేష్‌గౌడ్ ఉన్నారు. ఈ సంఘటనతో వారు కన్నీరుమున్నీరయ్యారు. అలాగే అదేరోజు వనాయికుంటకు చెందిన ఊట్కూర్ ఆశప్ప (65) ఆసరా పింఛన్ కోసం గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు.



 వనపర్తి టౌన్ : మండలంలోని ఆంకూర్‌కు చెందిన మహాలంక కృష్ణయ్య (60) క్షౌరం చేసేందుకు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం చుట్టుపక్కల గ్రామాలు తిరిగాడు. అనంతరం ఇంటికి వచ్చి సొమ్మసిల్లి పడిపోగా కుటుంబ సభ్యులు గమనించి ఆస్ప్పత్రి తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా మృతి చెందాడు. ఈయనకు ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు.



 కొత్తూరు : మండలంలోని గూడూరుకు చెందిన గుండు నారాయణ (44) కు శివారులో కొంత పొలం ఉంది. అక్కడే పాడిపరిశ్రమ నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి పనులు చేశాడు. వడదెబ్బకు గురికాగా రాత్రి ఇంటికి వచ్చాక నిద్రలోనే మృతి చెందాడు.  



 మిడ్జిల్ : మండలంలోని రాయినోనికుంటతండాకు చెందిన హూమ్లి (70) కి శనివారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలయ్యాయి. ఆదివారం ఉదయం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందింది.



 నర్వ : మండలంలోని జంగంరెడ్డిపల్లికి చెందిన బర్ల కాసిమన్న (62) తమకున్న పశువులను ఆదివారం ఉదయం శివారులోకి మేతకోసం తీసుకెళ్లాడు. మధ్యాహ్నం అస్వస్థతో ఇంటికి తిరిగిరాగా నర్వ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. ఈయనకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.



 బల్మూర్ : మండలంలోని గట్టుతుమ్మెన్‌కు చెందిన ఎం.డి.పాషా (42) ఆదివారం మధ్యాహ్నం సమీపంలోని చెరువు గట్టుపైకి వెళ్లి వంట చెరుకు తీసుకుని ఇంటికి వచ్చి సృహతప్పి కిందపడిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కాగా, భార్య రజియాబేగం(40) కూడా ఐదు రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది.



 మానవపాడు : మండలంలోని జల్లాపురానికి చెందిన సరోజమ్మ (45), మద్దిలేటి దంపతులు ఆదివారం ఉదయం సమీపంలోని తమ పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం ఎండలోనే భార్య సృహతప్పి కిందపడిపోయింది. హుటాహుటిన ప్రైవేటు వాహనంలో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.



 గోపాల్‌పేట : మండలంలోని పొల్కెపహడ్‌కు చెందిన ఏదుట్ల శాంతయ్య (54) కు భార్య వెంకటమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరు కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వారకు పొలాల్లో మోదుగ ఆకులు తీసుకువచ్చేందుకు వెళ్లారు. అక్కడే భర్త వడదెబ్బకు గురయ్యాడు. సాయంత్రం ఇంటికి వచ్చి రాత్రి నిద్రలోనే ప్రాణాలు వదిలాడు.



 కొత్తకోట : మండలంలోని వడ్డేవాటతండాకు చెందిన ముత్యాలి (65) ఉపాధిహామీ పథకంలో కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవించేది. రెండు రోజుల క్రితం ఎండ తీవ్రతను తట్టుకోలేక అస్వస్థతకు గురైంది. దీంతో బంధువులు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మరోసారి ఆదివారం వడదెబ్బకు గురై మృతి చెందింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top