అమర్నాథ్ ఘటనలో 13 మందికి గాయాలు
సాక్షి, కామారెడ్డి: అమర్నాథ్ యాత్రలో ఉన్న 13 మంది కామారెడ్డి వాసులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గత నెల 27న కామారెడ్డికి చెందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర టూర్స్ యజమాని ఓంప్రకాశ్ 45 మందితో కలసి అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. ఈ నెల 5న అమర్నాథ్కు వెళ్లారు. 6న తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో అనంతనాగ్ సమీపంలోని ఖాజాగఢ్ ప్రాంతంలో ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురైంది. బస్సులోకి చొచ్చుకు వచ్చిన ఇనుçప ముక్కలు అందులో ఉన్న యాత్రికులకు గుచ్చుకున్నాయి. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డికి చెందిన జంగం జయంతి (52), కామారెడ్డి పట్టణానికి చెందిన లక్ష్మీబాయి(42) తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంత నాగ్లోని స్కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, 16 మందిని ఖాజాగఢ్ సీఆర్పీఎస్ క్యాంపులో ఉంచారు.
నిజామాబాద్ జిల్లావాసులు ఇద్దరు
పెర్కిట్(ఆర్మూర్): ఖాజాగఢ్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో గాయపడినవారిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన ఇద్దరు ఉన్నారు. ఆర్మూర్కు చెందిన రూప, గంగాప్రసాద్ దంపతులకు చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ మేరకు వారు ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.