నెల రోజులుగా నిలిచిపోయిన 104 సేవలు
నల్లగొండ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పల్లె ప్రజలను సంజీవనిలా ఆదుకున్న 104 వాహన సేవలు ఈమధ్య కాలంలో మందగించాయి.104 వాహనాలకు డీజిల్ లేకపోవడంతో 20రోజులుగా నల్లగొండ జిల్లాలోని నాలుగు మండలాల్లో వైద్యసేవలు నిలిచిపోయాయి. నూతనకల్, తిరుమలగిరి, తుంగతుర్తి, అర్వపల్లి మండలాల్లో వైద్య సేవలు బందై రోగులు అవస్థల పాలవుతున్నారు. డీజిల్కు బడ్జెట్ లేక వాహనాలను తుంగతుర్తిలోని క్లస్టర్ ఆస్పత్రిలో మూలకు పెట్టారు. ఈ సేవలు ఆగడంతో దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, బీపీ, ఫిట్స్ రోగులతో పాటు గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు.
తుంగతుర్తి క్లస్టర్కు రెండు 104 వాహనాలు ఉండగా, ఇవి నాలుగు మండలాల్లో సేవలు అందిస్తున్నాయి. ప్రతి నెలా సుమారు 5 వేలమంది రోగులకు ఈ వాహనాల ద్వారా వైద్య సేవలందిస్తారు. ఇందులో షుగర్, బీపీతో పాటు గర్భవతులకు, దీర్ఘకాలిక రోగులకు గ్రామాలకు వెళ్లి నెలనెలా మందులు అందించాల్సి ఉంది. కాగా వాహనాలు చెడిపోయి మందుల పంపిణీ ఆగిపోయింది. దీంతో రోగులు ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనుక్కోవాల్సివస్తుంది. వెంటనే వాహనాలకు బడ్జెట్ కేటాయించి వైద్య సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.