బైక్, ఆటో ఢీ:10 మందికి గాయాలు
రాజాపేట: వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామశివారులో శుక్రవారం జరిగింది. వివరాలు.. మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన 21 మంది కూలీలు యాదగిరి గుట్ట మండలం కాచారానికి కూలి నిమిత్తం వెళ్తుండగా ఆటో గ్రామ శివారులోని రామస్వామిగుట్ట వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది.
దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తితో పాటు.. ఆటోలో ఉన్న 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో నలుగురు మహిళా కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.