అంతిమ విజయం మనదే!
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘మహాభారతం, రామాయణం, ఖురాన్, బైబిల్... పవిత్ర గ్రంధాలన్నీ ధర్మానిదే అంతిమ విజయమని చెబుతున్నాయి. కాలక్షేపం కోసం సినిమాకు వెళ్లినా 13 రీళ్లల్లోనూ విలన్ పాత్రదే పైచేయి, 14వ రీల్లో హీరో విజయం సాధిస్తారు. పవిత్ర గంథ్రాలైనా, సినిమా అయినా నీతి ఒక్కటే... అంతిమ విజయం ధర్మానిదే. ప్రజల మనస్సులు గెలవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. డబ్బు అహంకారంతో కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు. ఇవేవీ ఎంతోకాలం నిలబడవు. మరో రెండేళ్లు ఇదే పోరాట స్ఫూర్తితో పనిచేయండి.
అంతిమంగా విజయం మనదే’’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప జయరాజ్గార్డెన్ ఫంక్షన్హాల్లో రైల్వేకోడూరు, బద్వేల్, మైదుకూరు, రాజంపేట, కడప నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లను పేరుపేరునా పలకరించి, మాట్లాడారు. కాగా, వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో అధికార టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి ఎంపికైన ఒక జెడ్పీటీసీ సభ్యురాలు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం జయరాజ్ గార్డెన్లో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు.