దుర్గ గుడి వద్ద కత్తితో మహిళ హల్‌చల్


విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దుర్గగుడి మహా మండపం వద్ద కత్తి పట్టుకుని ఓ మహిళ హల్‌చల్ చేసింది. మతిస్థిమితం లేని ఓ గుర్తుతెలియని మహిళ మూడు రోజులుగా మహా మండపం పరిసరాల్లో తిరుగుతున్నట్లు శానిటరీ సిబ్బంది పేర్కొన్నారు. అయితే బుధవారం ఆ మహిళ ప్రవర్తనలో తీవ్ర మార్పు రావడమే కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని దూషించడం ప్రారంభించింది. క్యూలైన్ మెట్లపై కూర్చొన్న భక్తులను తిడుతుండటంతో వారు ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు.


మహిళ మానసిక స్థితి సరిగా లేదని గుర్తించిన ఆలయ సిబ్బంది వెంటనే మహిళను అక్కడ నుంచి దూరంగా తరలించాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. మహిళ వద్ద ఉన్న మూడు బ్యాగులను పరిశీలించగా చాకు కనిపించింది. దీంతో సెక్యూరిటీ ఆఫీసర్ రాఘవరావు అవుట్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న భాస్కరరావుకు విషయం చెప్పడంతో వారు  అక్కడకు చేరుకున్నారు.


మహిళ వల్ల భక్తులకు ఏదైనా ప్రమాదం జరుగుతుందనే భావనతో వెంటనే ఆమెను ఆటోలో దేవస్థానానికి దూరంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళను ఆటోలో తరలిస్తుండగా కూడా ఆలయ సిబ్బందిని దూషిస్తూనే ఉంది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top