పాణ్యం పీఎస్ వద్ద గ్రామస్థుల ఆందోళన
పాణ్యం : కర్నూలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ కేసులు బనాయించి తమ వారిని తీవ్రంగా హింసిస్తున్నారంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన పాణ్యం పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం చోటుచేసుకుంది. కొండజూటూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న నానో కెమికల్ ప్యాక్టరీని అడ్డుకుంటున్న గ్రామస్థులను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారు.
ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరింత మందిపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పోలీస్స్టేషన్ ఎదుట ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.