విజయనగరంలో అధికార టీడీపీకి షాక్
టీడీపీకి వాసిరెడ్డి వరదరామారావు రాజీనామా
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ, విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ నేత వాసిరెడ్డి వరదరామారావు రాజీనామా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షంపై, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రభుత్వ వైఖరి అభ్యంతరకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరగకుండా పోరాడుతున్న ప్రతిపక్ష నేత పట్ల విశాఖపట్నంలో ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందంటూ తీవ్రంగా కలత చెందారు.
సర్కారు చర్యలను నిరసిస్తూ.. టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్కు రాజీనామా లేఖను పంపించారు. తన రాజీనామాను అంగీకరించాలని కోరారు. ఆదివారం ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. వాసిరెడ్డి తన తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నారు. విజయనగరం జిల్లాలో వాసిరెడ్డి వరదరామారావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తండ్రి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు మంత్రిగా పనిచేశారు.