‘వజ్ర’రామయ్య!


 సీఎం సిద్ధరామయ్య వాచ్ ఖరీదు రూ.50-70లక్షలు వాట్సాప్ వీడియోలను సాక్ష్యంగా చూపిన మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి

 

 బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధరించే వాచ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కన్నా హాట్ టాపిక్‌గా మారింది. ‘లోహియా’ ఆదర్శాలను పాలించే వ్యక్తిగా, అనుచరుడిగా సీఎం సిద్ధరామయ్య తనకు తాను చెప్పుకుంటూ ఉంటారు. అయితే సిద్ధరామయ్య లోహియా పేరును కేవలం ప్రచారానికి మాత్రమే ఉపయోగిస్తున్నారని, ఆయన నిజజీవితం పూర్తిగా విలాసవంతమైనదంటూ మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి గత కొద్దిరోజులుగా ఆరోపిస్తూ వస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య రూ.50-70లక్షల విలువచేసే వాచ్‌ను, రెండు లక్షల రూపాయల విలువ చేసే కళ్లద్దాలు ధరిస్తారని కుమారస్వామి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. ‘కుమారస్వామి చెప్పేవన్నీ అబద్ధాలే, కావాలంటే నా కళ్లద్దాలను రూ.50వేలకు, నా వాచ్‌ను పదిలక్షల రూపాయలకు ఇచ్చేస్తాను, తీసుకోమనండి’ అంటూ ప్రతిస్పందించారు.



అయితే ఈ విషయానికి సంబంధించిన ఆధారాలను హెచ్.డి.కుమారస్వామి మంగళవారం మీడియాకు అందజేశారు. బీదర్‌లో కుమారస్వామి మాట్లాడుతూ....‘సిద్ధరామయ్య ధరించే వాచ్ హ్యూబ్లోట్ బ్రాండ్‌కు చెందినది. ఈ వాచ్‌ను పూర్తిగా బంగారుపూతతో తయారుచేస్తారు. డయల్‌లోని నంబర్‌లు వజ్రాలతో చేయబడతాయి.

 అందువల్లే ఈ వాచ్ ధర రూ.50-70 లక్షలుగా ఉంటుంది. సిద్ధరామయ్య ఓ పెళ్లికి హాజరైనపుడు ఆయన ఈవాచ్‌ను ధరించారు. ఆ వీడియోను వాట్సాప్ ద్వారా తెప్పించుకొని ఆ వీడియోను దుబాయ్‌కి పంపించి, ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాను’ అని తెలిపారు. దీంతో సిద్ధరామయ్య ధరించిన వాచ్ విషయం ప్రస్తుతం కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top