దీనావస్థలో భీం వారసులు

దీనావస్థలో భీం వారసులు


వీరి కుటుంబాల పరిస్థితి దయనీయం    

వెలుగులోకి భీం మనుమరాళ్లు..

కూలీ పనితో కుటుంబాల పోషణ    

ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని వేడుకోలు

 

కెరమెరి : నిజాం సర్కార్‌తో పోరాటం సాగించిన గిరిజన యోధుడు కుమ్రం భీం తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  ఏ ఆశయం కోసం పోరాడిన యోధుడిని ఎందరో స్మరించుకుంటున్నారు. కుమ్రం భీం త్యాగాలను ప్రభుత్వం గుర్తించి జోడేఘాట్‌లో రూ. 25 కోట్లతో స్మారకపనులు చేపడుతోంది. కానీ ఆయన వారసులు మాత్రం దీనవస్థలో ఉన్నారు. నిన్నటివరకు భీం మనుమడు సోనేరావు, మనుమరాలు సోంబాయిలే తెలుసు.

 

కానీ మరో మనుమడు, ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారనే విషయం తెలియదు. వీరు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఉండడానికి ఇల్లు లేదు. చేతిలో పనిలేదు. వారికున్న సాగుభూమిలో పంటదిగుబడి లేకపోవడంతో పూటగడవడం కష్టంగా మారింది. వారి జీవన స్థితిగతులపై సాక్షి ప్రత్యేక కథనం.

 

 వారసత్వం పై అలసత్వం

 ‘కుమ్రం భీం’కు  ఇద్దరు సంతానం. కుమారుడు మాధవరావు, కూతురు రత్తుబాయి. మాధవరావుకు ముగ్గురు పిల్లలు. సోనేరావు, భీమ్‌రావు వీరు సిర్పూర్(యు) మండలంలోని దోబే గ్రామంలో నివసిస్తున్నారు. రాధాబాయిది ఆసిఫాబాద్ మండలం మోవాడ్ గ్రామం. భీం కుమారుల పరిస్థితి బాగు ఉన్నా.. చహకటి రత్తుబాయి నలుగురు పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈమెకు ముగ్గురు కూతుర్లు. ఒకరు సోంబాయి జోడేఘాట్‌లో, మరొకరు ఆడ జంగుబాయి, చహకటి ఎల్లు కొఠారిలో, ఇంకొకరు కుమ్రం కాసుబాయి సాకడ గ్రామంలో ఉంటున్నారు.

 

స్ఫూర్తిదాతగా నిలిచారు

భీం గొప్పవ్యక్తి..ఆదివాసీలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను గు ర్తించింది. దాంతో జోడేఘాట్ కొత్త పుంతలు తొ క్కనుంది. ఆయన త్యాగానికి గుర్తించిన సర్కార్.. జోడేఘాట్‌ను అభివృద్ధి బాటలో నిలిపేందుకు కృషిచేస్తోంది. కానీ, ఆయన వారసుల  జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఇకనైన మా బతుకులు బాగుపడతాయంటే అధికారులు మమ్మల్ని గుర్తించడం లేదంటు భీం మనమరాళ్లు ఆడ జంగుబాయి, కుంరం కాసుబాయి, చహకటి ఎల్లు ఆవేదన చెందుతున్నారు.

 

జంగుబాయి గృహం పునాదులకే పరిమితం

మండలంలోని కొఠారి గ్రామంలో కొన్నేళ్లుగా కు మ్రం జంగుబాయి నివసిస్తోంది. వీరికి పెంకుటి ల్లు దిక్కు. పదేళ్ల కిందట మంజూరైన ఇంది ర మ్మ గృహం పునాదులకే పరిమితమైంది. పాలక ప్రభుత్వాలు మారుతున్న వీరి బతుకుల్లో వెలు గు లేకుండాపోయింది. వీరిని పట్టించకున్న నా థుడే లేడు. ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసి ఆదుకోవాల్సిన పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో వారు ఆ ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.


మరోసారి ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ఎలాంటి సాగుభూమి కూడా లేకపోవడంతో కూలీ చేసి కుటుంబాన్ని పోషిస్తుంది. కాగా, ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో రోజుకు రూ. 100తో వంట మనిషిగా పనిచేస్తోంది. భీం వారసురాలైన ఈమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసహాయం అందలేదు. ఈమె, భర్త జంగు, కళ్లు కనిపించవు. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పెళ్లి అయింది.

 

కనిపించని ఆర్థిక సహాయం

మండలంలోని సాకడ గ్రామంలో నివసిస్తున్న భీం చిన్న మనుమరాలు కుమ్రం కాసుబాయి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఇల్లు మంజూరైన బిల్లు మాత్రం అందకపోవడంతో అప్పులు చేసి రేకుల ఇల్లు నిర్మించింది. ఉన్నా మూడెకరాల సాగుభూమిలో పంట దిగుబడి రాలేదు. దీంతో కుటుంబపోషణ భారమైంది. ఇప్పటికి శావుకారుల వద్ద నుంచి చేసిన అప్పులు తీర్చేదెలాగని ఆమె ఆందోళన చెందుతోంది. భీంతో సంబంధం ఉన్నట్లు కూడా అధికారులకు తెలియదు. అసలు ఆ దిశగా ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించలేదు. భర్త భీం, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 

ఎల్లుది కూడా అదే గతి

మండలంలోని కొఠారిలో ఉంటున్న మనుమడు చహకటి ఎల్లు పరిస్థితి కూడా ఇదే. మూడెకరాల సాగుభూమి ఉన్నప్పటికి రాళ్లురప్పలతో కూడుకుంది. ప్రతీ సంవత్సరం అప్పు చేసి వేలకువేలు వెచ్చిస్తున్నప్పటికి దిగుబడి రావడం లేదు. ఖరీఫ్‌లో వ్యవసాయం చేస్తుండగా మిగిలిన రోజుల్లో కూలీ పని దిక్కు. భార్య చిత్తుబాయి, కొడుకు వినోద్, సంజు ఉన్నారు.

 

పట్టించుకోని అధికారులు

ఇప్పటివరకు చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులకు కలిసి నివేదనలు సమర్పించిన స్పందించిన దాఖలాలు లేవు. ఐటీడీఏ నుంచి రుణం అందలేదు. ఎడ్డు జతలు కావాలని గతంలో దరఖాస్తులు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇళ్లు లేవు, వ్యవసాయ భూములు లేవు, ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం కుమ్రం భీం చేసిన త్యాగాలను గుర్తించి జోడేఘాట్‌లో రూ. 25 కోట్లతో స్మారక పనులు చేపడుతున్నప్పటికి భీం వారసుల పరిస్థితి మాత్రం కడు దయనీయంగా మారింది.

 

ప్రభుత్వం ఆదుకోవాలి

తమను ప్రభుత్వం ఆదుకోవాలి. తాత కుమ్రం భీం పేరిట వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మా కుటుంబాల గురించి పట్టించుకోవాలి. మమ్మల్ని కూడా గుర్తించి తగిన ఆర్థిక సహాయం అందించాలి. ఐటీడీఏ నుంచి రుణం ఇవ్వాలి.

 - ఆడ జంగుబాయి. కొఠారి

 

 ఎడ్ల జతలివ్వాలి

 వ్యవసాయం చేసేందుకు కనీసం ఎడ్ల జతలన్న ఇవ్వాలి. ఎలాంటి సహకారం లేకపోవడంతో అష్టకష్టాల్లో ఉన్నాం. ప్రభుత్వం సాగుభూమి అందించాలి. సోనేరావుకు ఇచ్చిన ట్లే ఆర్థిక సహాయం ఇవ్వాలి.  

 - చహకటి ఎల్లు, కొఠారి

 

 భూమి పంచివ్వాలి

 మ తల్లి గారి భూమి దోబే గ్రామంలో ఉంది. ఒక్క మనుమడే లాభం తీసుకుంటున్నాడు. అది అందరికి దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి నాలుగు ఎకరాల భూమిని పంచి ఇవ్వాలి. మా పరిస్థితులను బాగు చేయాలి.

 - కుంరం కాసుబాయి, సాకడ

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top