పోతే.. పోనీ!

పోతే.. పోనీ!


పళని గొడుగు నీడకు ఎమ్మెల్యే ఆరుకుట్టి

n    ఆయనే వచ్చారు..ఆయనే వెళ్లారన్న పన్నీరు

n    మద్దతుదారులతో మంతనాలు


తనంతకు తానుగా వచ్చారు.. ఆయనే వెళ్లారు.. పోతే..పోనీ.. అంటూ పళని పంచన చేరిన ఎమ్మెల్యే ఆరుకుట్టిని ఉద్దేశించి పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్న వారినైనా దక్కించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. పార్టీ వర్గాలతో ఆదివారం మంతనాల్లో మునిగినా,  మళ్లీ చర్చల నినాదాన్ని పలువురు ముందుకు తీసుకొచ్చినట్టు సమాచారం.



సాక్షి, చెన్నై  :
సేలం ఆర్‌ ఆండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వేదికగా సీఎం పళని స్వామి నేతృత్వంలోని ఎమ్మెల్యే ఆరుకుట్టి అమ్మ శిబిరంలో  చేరారు. మరికొందరు ఆయన బాటలో పయనిస్తారనే సమాచారంతో పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. సీ ఎం పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే అమ్మ శిబిరం వెంట 122 మంది, మాజీ సీఎం పన్నీ రు సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే.



పన్నీరు సెల్వం శిబిరంలో ఇటీవల అసంతృప్తి రాజుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలు సైతం పన్నీరుకు తగ్గుతుండడంతో ఆ శిబిరంలోని నేతలు, ఎమ్మెల్యేలు అంతర్మథనంలో పడ్డారు. అసంతృప్తిని బయటపెడుతూ గౌండం పాళయం ఎ మ్మెల్యే ఆరుకుట్టి ఆ శిబిరం నుంచి బయటకు అడుగువేశారు. పన్నీరు ప్రత్యేక శిబిరాన్ని గతంలో ప్రకటించినప్పుడు అందులో అడుగుపెట్టిన తొలి ఎమ్మెల్యే ఆరుకుట్టి. ఇప్పుడు ఆ శిబిరం నుంచి బయటపడ్డ తొలి వ్యక్తి కూడా ఆయనే. ఈ దృష్ట్యా, ఇక, ఆ శిబిరం నుంచి జంప్‌జిలానీల సంఖ్య ఇక పెరగడం ఖాయం అనే సంకేతాలు వెలువడుతున్నాయి.



పళని పంచన ఆరుకుట్టి

పన్నీరు శిబిరం నుంచి బయట పడ్డ ఆరుకుట్టి ఆదివారం ఉదయం సేలం ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో ఉన్న సీఎం పళని స్వామిని కలుసుకున్నారు. తన మద్దతుదారులు, నియోజకవర్గ  నేతలతో కలిసి అమ్మ శిబిరంలో చేరారు. అమ్మ ప్రభుత్వానికి మద్దతుగా ముందుకు సాగుతానని ప్రకటించారు. ఇక, తన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా హితం లక్ష్యంగా తాను అమ్మ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని నిర్ణయం తీసుకున్నానని ఆరుకుట్టి ప్రకటించారు. తనవలే మరెందరో ఆ శిబిరంలో అసంతృప్తితో ఉన్నారని, వారు కూడా అమ్మ ప్రభుత్వం వైపు రావడం ఖాయం అని ప్రకటించడం గమనార్హం.



ఆయనే వచ్చారు.. ఆయనే వెళ్లారు..

ఆరుకుట్టి బాటలో మరికొందరు అమ్మ శిబిరంలోకి వెళ్లే అవకాశాలున్న సమాచారంతో పన్నీరు సెల్వం మేల్కొన్నారు. ప్రస్తుతం ఆయన వెంట కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. 12మందిలో మైలాపూర్‌ ఎమ్మెల్యే నటరాజ్‌ తటస్థంగా ఉండగా, ఆరుకుట్టి హ్యాండిచ్చారు. ఇక, పన్నీరుతో పాటుగా సెమ్మలై, శరవణన్, మనోహరన్, మాణిక్యం, షణ్ముగనాథన్, చిన్నరాజ్, అరుణ్‌కుమార్, పాండియరాజన్, మనోరంజితం మాత్రమే ఉన్నారు. వీరిలో నలుగురు అమ్మ గొడుగు నీడకు చేరడానికి సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఆరుకుట్టికి అమ్మ శిబిరంలో ఇచ్చే విలువ, ప్రాధాన్యత మేరకు ఈ నలుగురు జంప్‌ జిలానీ కావడం తథ్యం.



ఈ పరిస్థితుల్లో ఆదివారం గ్రీన్‌ వేస్‌ రోడ్డులోని తన నివాసంలో ముఖ్య నేతలతో పన్నీరు సెల్వం మంతనాల్లో మునిగారు. ఇందులో కొందరు మళ్లీ అమ్మ శిబిరంతో చర్చలకు సిద్ధం అవుదామన్న నినాదాన్ని అందుకున్నట్టు సమాచారం. అందుకే కాబోలు పన్నీరు సెల్వం సమావేశం మధ్యలో బయటకు వచ్చేసి కారులో వెళ్లి పోవడం గమానార్హం. అంతకు ముందు ఆరుకుట్టి జంప్‌ గురించి మీడియా సంధించిన ప్రశ్నకు, ఆయనే వచ్చారు.. ఆయనే వెళ్లారు..పోతే పోనీ.. అంటూ పన్నీరు వ్యాఖ్యానించడం ఆలోచించ దగ్గ విషయం. ఇదిలా ఉండగా, ఆగస్టు తర్వాత అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ రూపంలో ఏదేని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉండబట్టే, బలాన్ని పెంచుకునే విధంగా పన్నీరు శిబిరాన్ని పళని గురిపెట్టినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top