అమెరికాలో రోడ్డు ప్రమాదం : ప్రవాసాంధ్రుల మృతి
మృతులు ఖమ్మం, హైదరాబాద్లకు చెందిన విద్యార్థులు
ఎర్రుపాలెం: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఎర్రుపాలెం మండల పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం సర్పంచ్ యరమల శ్రీనివాసరెడ్డి కుమారుడు యరమల రాజశేఖరరెడ్డి (25) ఎంఎస్ కోసం అమెరికాలోని కెంటకీ రాష్ట్రానికి గత జనవరిలో వెళ్లాడు.
అక్కడి కాలమానం ప్రకారం ఈనెల 22 రాత్రి 10 గంటల సమయంలో స్నేహితులతో కలసి కారులో ప్రయాణిస్తుండగా, హెబ్రాన్ వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో హైదరాబాద్కు చెందిన కొమ్ము వెంకట వరప్రసాద్ (24) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాల పాలైన రాజశేఖరరెడ్డి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మరో ఇద్దరు స్నేహితులు వరహబట్ల రాము (35), అన్వేష్ కుమార్ (27) గాయాలపాలయ్యారు.