‘వారి కనుసన్నల్లోనే సభ జరిగింది’
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కనుసన్నల్లో అసెంబ్లీ జరిగిందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం 33 గంటల్లో 30 గంటలు సీఎం, ఆయన కుటుంబ సభ్యులే మాట్లాడగా మంత్రులు తోలుబొమ్మలైపోయారని ఎద్దేవా చేశారు. ఏకమొత్త రుణమాఫీ చేసేది లేదని ప్రభుత్వం తేల్చేసిందని చెప్పారు. రైతుల ఆత్మహత్యల్లో ఎన్సీబీఆర్ నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు. సోయా, కందులు వేసుకోమని రైతులకు చెప్పిన సీఎం మద్ధతు ధర విషయం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
నిజాం షుగర్స్ మూసేస్తే సీఎం పదవి పోవడం ఖాయమని అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్పై సభలో కాంగ్రెస్ను సమన్వయం చేసుకుని బైఠాయించామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు 15 మంది అని కోర్టుకు చెప్పిన స్పీకర్.. సభలో మాత్రం ముగ్గురే అని ప్రకటించారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ రాజకీయ వ్యభిచారం సభ సాక్షిగా బట్టబయలైందన్నారు.