ప్రజల్ని మార్చడం నా పని కాదు
ప్రజలను మార్చడం నా పని కాదు. నేను నా గురించే ఎక్కువగా ఆలోచిస్తాను అంటున్నారు నటుడు సిద్ధార్థ్. బాయ్స్ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన ఈయన చాక్లెట్ బాయ్గా ముద్రవేసుకున్నారు. అలాంటి ఇమేజ్ కొన్ని అవకాశాలు కోల్పోవడానికి కారణమైంది. ఆయన మైనస్లను ప్లస్గా మార్చుకుని తీయవేలై సెయ్యనుం కుమారా, జిగర్తండా, కావ్యతలైవన్ వంటి చిత్రాల్లో విజయాలు అందుకున్న సిద్ధార్థ్తో చిట్చాట్..
ప్రశ్న : తమిళ చిత్రసీమలో పోరాడుతున్నట్లుగా ఉన్నారు?
జవాబు: ఇంతకుముందు హిందీ, తెలుగు చిత్రాల్లో నటించినా ఇప్పుడు పూర్తిగా తమిళుడినయ్యాను. రెండేళ్లుగా ఇతర భాషా చిత్రాలేవీ చేయడం లేదు. తమిళ చిత్ర పరిశ్రమలో నాకో గుర్తింపు అవసరం. ఇక్కడ నాకు నచ్చిన చిత్రాలుచేయాలి. నటుడుగా ఉన్నత స్థాయికి చేరుకోవాలి. సిద్ధార్థ్ ఒక తరహా చిత్రాలకే పని కొస్తాడు అనే ఇమేజ్ చట్రంలోకి వెళ్లకూడదు అన్న విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాను.
ప్రశ్న: మీరిప్పటి వరకు నేర్చుకున్నది?
జవాబు: జీవితంలో నిత్యం ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే వున్నాను. 23 చిత్రాల్లో నటించిన నేను కావ్యతలైవన్ చిత్రంలో చాలా బాగా నటించారనే ప్రశంసలు చాలా ఆనందానిచ్చాయి.
ప్రశ్న: కథలను ఎంపిక చేయడంలో ఎవరుదిట్ట?
జవాబు: సెల్ఫ్ డబ్బా అనుకున్నా ఫర్వాలేదు. ఈ ఏడాది సిద్ధార్థ్ మాదిరిగా వేరెవరూ మంచి కథల్ని ఎంపిక చేసుకోలేదు. ఇది నిజం. ఇలాంటి అవకాశాలు మళ్లీ వస్తాయని చెప్పలేను. ఈ విషయం తలచుకుంటేనే గర్వంగా ఉంది.
ప్రశ్న: దర్శకత్వం వహించే ఆలోచన ఉందా?
జవాబు: నేను మణిరత్నం వద్ద సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడే పలుకథలు తయారుచేసుకున్నాను. అదే విధంగా చిన్న వయసు నుంచే కమలహాసన్ వీరాభిమాని.ఆయన నటన అంటే చాలా ఇష్టం. అవకాశం కలిగితే ఆయన్ను దర్శకత్వం చేస్తాను.
ప్రశ్న: సామాజిక సేవలో మీ భాగం?
జవాబు: నేను నా గురించే అధికంగా ఆలోచిస్తాను. ఇతరులను మార్చడం నా పని కాదు. మరో విషయం ఏమిటంటే అందరూ ఆదాయపు పన్ను చెల్లించాలని నేను భావిస్తాను. అయినా సగం మంది పన్ను చెల్లించడం లేదు. ఒకపౌరుడిగా కొన్ని మంచి కార్యాలను చేస్తాను. అయితే అవన్నీ ప్రచారం చేసుకోవడం నాకిష్టం ఉండదు.