హృషికేష్‌జీకి అంకితం చేస్తున్నా


తన తాజాచిత్రం‘ఖూబ్‌సూరత్’ను దివంగత నిర్మాత హృషికేష్ ముఖర్జీకి అంకితం చేస్తున్నానని బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పేర్కొంది. 1980లో హృషికేష్ ముఖర్జీ ‘ఖూబ్‌సూరత్’ సినిమా తీశారు. ఇప్పుడు అదే టైటిల్‌తో విడుదలైన సినిమాలో సోనమ్ నటించింది. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాలో పాకిస్థాన్ నటుడు ఫవద్‌ఖాన్ కథానాయకుడిగా నటించాడు. ‘ఈ సినిమాలో  నాది ప్రధాన పాత్ర కాదు. ప్రతి సినిమాకి నిర్మాత, దర్శకుడు, రచయితలే కథానాయకులనేది నా భావన. ఏ సినిమా హిట్ అయినా ఆ గొప్పదనాన్ని నా ఖాతాలో వేసుకోను. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద అది బోల్తాపడినా ఆ నింద నాపై మోపవద్దు. సినిమా అనేది ఉమ్మడి కృషి.

 

 అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది’ అని అంది. ఈ సినిమా మీ సొంత బ్యానర్‌పై విడుదలైనందువల్ల ముందుజాగ్రత్తలేమైనా తీసుకున్నారా అని అడగ్గా ఒక వస్తువును మార్కెట్‌లోకి విడుదల చేసేముందు దానిపై మనకు సంపూర్ణ విశ్వాసముండాలంది. హృషికేశ్ ఇప్పటికీ బతికిఉండి ఈ సినిమా చూసినట్టయితే సంతోషించేవాడేమో కదా అని అడగ్గా ఒకవేళ ఆయన కనుక ఈ సినిమాను చూసినట్టయితే తనకు ఇబ్బందిగా అనిపించేదేమో అంది. హృషికేష్ తీసిన ఈ సినిమాని పునర్‌నిర్మించాల్సిన అవసరం ఉందని మీకు ఎందుకనిపించిందని ప్రశ్నించగా అందరినీ కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశామని తెలిపింది. ఈ సినిమాని ఆ మహానుభావుడికే ఎంతో ప్రేమతో అంకితం చేస్తున్నానని చెప్పింది. మీ భవిష్య ప్రణాళికలేమిటని అడగ్గా ఈ నెల 21వ తేదీనుంచే ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమా షూటింగ్ ప్రారంభించామంది. తన సోదరి రేహా కూడా మరో సినిమా తీస్తోందని తెలిపింది.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top