సామాన్యుల ‘మిషన్ సప్నే’!


 న్యూఢిల్లీ : నగరంలో కటింగ్ చేయించుకోవడానికి వెళ్లిన మీకు క్షౌరశాలలో సల్లూభాయ్ (సల్మాన్‌ఖాన్) కత్తెర పట్టుకుని కనిపించవచ్చు.. మరికొంతమంది సెలబ్రిటీలు చెప్పుల షాపులో సేల్స్‌బాయ్‌గానో, టాక్సీ డ్రైవర్‌గానో, కూరగాయలమ్ముకుం టూనో కనిపించవచ్చు.. ‘మిషన్ సప్నే’ అనే టీవీ షో ప్రచార కార్యక్రమంలో భాగంగా సల్లూభాయ్‌తోపాటు కరణ్ జోహార్, రణబీర్ కపూర్, హర్భజన్ సింగ్ వంటి పలువురు సెలబ్రిటీలు సైతం పాలుపంచుకుంటున్నారు. సమాజంలో వివిధ వృత్తుల్లో ఉంటున్న సామాన్య వ్యక్తులన్న ఈ టీవీ షోలో ‘హీరో’లుగా చూపించబోతున్నారు. ఈ షో సీజన్ వన్‌లో పలువురు బాలీవుడ్, టెలివిజన్, క్రీడలు, సంగీత ప్రముఖులు కనిపించనున్నారు. ఒక రోజు పాటు సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ క్షురకుడిగా, ప్రముఖ నిర్మాత/దర్శకుడు కరణ్ జోహార్ ఫొటోగ్రాఫర్‌గా, హీరో రణబీర్ కపూర్ వడాపావ్ అమ్మే వ్యక్తిగా, పట్టీవాలాగా వరుణ్‌ధావన్ కనిపిస్తారు.

 

 అలాగే కూరగాయలు అమ్ముకుంటూ సిద్ధార్థ్ మల్హోత్రా కనిపించనుండగా, క్రికెటర్ హర్భజన్ సింగ్ చిరు తిండిపదార్థాలు అమ్మబోతున్నాడు. అలాగే గాయకుడు మికాసింగ్ టీవాలాగా దర్శనమివ్వనున్నాడు. వీరితోపాటు ప్రముఖ టీవీ నటులు రోనిత్ రాయ్ కాస్మొటిక్స్ అమ్ముతూ, రామ్ కపూర్ ట్యాక్సీ నడుపుతూ, ద్రక్షిధామి నిమ్మకాయలు, మిరపకాయలు అమ్ముతూ ప్రేక్షకులను అలరించనున్నారు. కలర్స్ చానల్‌లో ఈ నెల 27వ తేదీ రాత్రి 8 గంటల నుంచి కార్యక్రమం ప్రసారం కానుంది. దీనికి బాలీవుడ్ నటి సోనాలి బింద్రే వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. ఈ సందర్భంగా కలర్స్ సీఈ వో రాజ్‌నాయక్ మాట్లాడుతూ  ఒక ఉన్నతాశయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సెలబ్రిటీలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. దీనికోసం వారు ఎటువంటి పారితోషికం కూడా తీసుకోవడంలేదని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమ ప్రసారాల్లో టాటా మోటార్స్ కూడా భాగస్వామిగా చేరిందని నాయక్ తెలిపారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top