గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
మహబూబ్నగర్: విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా నర్వ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. మహబూబ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నర్వకు వెళ్తుండగా.. బస్సు డ్రైవర్ మధుసూదన్రెడ్డి గుండెపోటుకు గురై ఒక్కసారిగి కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన ప్రయాణికులు ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా మృతి చెందాడు.
ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించి బస్సును రహదారి పక్కన నిలిపివేయడంతో తాము క్షేమంగా ఉన్నామని ప్రయాణికులు తెలిపారు. మృతుడు పెబ్బేరు మండలం జనగంపల్లి గ్రామవాసిగా తెలిసింది. ఇటీవలే నల్లగొండ జిల్లా చండూరు వద్ద ఇదే విధంగా రిటైర్మెంట్కు ఒక్కరోజు ముందు డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే.