కరోనా ఏసీ బస్సులు ప్రారంభం


విజయవాడ: ఏపీఎస్‌ఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేసిన కరోనా గరుడ ఏసీ బస్సులను రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం విజయవాడలో ప్రారంభించారు. మొత్తం 15 బస్సులు రెండు వారాల క్రితమే విజయవాడ చేరుకోగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వారం కిందటే పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీకి నష్టాలు కొత్తేమి కాదని, ప్రణాళికాబద్ధంగా పనిచేసి వాటిని అధిగమిస్తామని అన్నారు. కార్మికులు, అధికారులు కలిసి పనిచేస్తే నష్టాల నుంచి గట్టెక్కించవచ్చన్నారు.

 

ప్రైవేటు బస్సుల నుంచి పోటీ ఉన్నప్పటికీ పనితీరు మెరుగుపరుచుకోవడం ద్వారా ఆర్టీసీ లాభాల బాట పట్టవచ్చన్నారు. కాగా, 11 సర్వీసులను కృష్ణా రీజియన్‌కు, మిగతా వాటిని ఇతర రీజియన్లకు కేటాయించనున్నారు. విజయవాడ నుండి హైదరాబాద్‌కు 9, బెంగళూరుకు 4, చెన్నైకి 2 ఏసీ బస్సులు నడుపుతారు. మంత్రి దేవినేని ఉమ, అధికారులను ఎక్కించుకుని మంత్రి అచ్చెన్నాయుడు కొద్దిసేపు బస్సు నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top