'సొంత జిల్లాలో మన్నవరం కాపాడుకోలేని చంద్రబాబు'
తిరుమల: సొంత జిల్లాలో మన్నవరం ప్రాజెక్టును కాపాడుకోలేని ఆయన రాష్ట్రానికి నూతన పరిశ్రమలు ఎలా తీసుకొస్తారంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. గురువారం ఉదయం తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామిని రోజా సందర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల రోజా విలేకర్లతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం ప్రజలు పోరాడుతుంటే... వారిని జైల్లో పెడతామని చంద్రబాబు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అలాగే ఇదే అంశంపై పోరాడుతున్న విద్యార్థును సైతం జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని వెంకయ్య నాయుడు, 15 ఏళ్లు కావాలని చంద్రబాబు కోరిన సంగతిని ఈ సందర్భంగా రోజా గుర్తు చేశారు. అలాంటి వారు ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాట్లాడుతున్నారన్నారు. అబద్దాలాడిన చంద్రబాబు, వెంకయ్యలను ఎం చేయాలని రోజా ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే చిత్తశుద్ధి ఉందని రోజా స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని రోజా పేర్కొన్నారు.