ఎదురుదాడి
♦ రాష్ట్రంలో రజనీ అభిమాన సంఘాల ఆందోళనలు
♦ చెన్నై, మదురైలో 50 మంది అరెస్ట్
♦ రజనీపై కొనసాగుతున్న విమర్శలు
సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని వివాదం చేయడాన్ని ఖండిస్తూ ఆయన అభిమానులు మంగళవారం ఆందోళనకు దిగారు. రజనీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సహించబోమని అభిమాన సంఘాలు హెచ్చరించాయి. చెన్నై, మదురైలో ఆందోళనలు చేపట్టిన 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి వస్తారా..రారా అనే చర్చ ఎన్నో ఏళ్లుగా నానుతోంది. 1998లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు వ్యతిరేకంగా డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా రజనీకాంత్ చేసిన ప్రకటన వారికి అఖండ విజయాన్ని సాధించి పెట్టింది. ఆనాటి రజనీ ప్రకటన రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతో ఆ తరువాత ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా జాగ్రత్త పడ్డారు. భారతీయ జనతా పార్టీ ఎంతోకాలంగా రజనీని పార్టీలోకి ఆహ్వానిస్తోంది.
గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏకంగా సీఎం అభ్యర్థిగా పోటీచేసే అవకాశాన్ని కూడా ఇచ్చినా రజనీ సున్నితంగా తిరస్కరించారు. గడిచిన పార్లమెంటు ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ స్వయంగా రజనీ ఇంటికి వెళ్లి కలుసుకున్నారు. అయితే ఆయన అటు వెళ్లగానే తమది స్నేహపూర్వక కలయిక మాత్రమే, రాజకీయ ప్రాధాన్యత లేదని రజనీ ప్రకటించారు.
రాజకీయాలు అంటకుండా గత పదేళ్లుగా ఎంతో జాగ్రత్తగా నెట్టుకుంటూ వస్తు న్న రజనీకాంత్ అకస్మాత్తుగా అభిమానులతో వరుసగా ఐదురోజులపాటు సమావేశమయ్యారు. రాజకీయ ప్రసంగాలు చేశారు. పేర్లు ప్రస్తావించకుండా కొందరు పాలకులపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్యం దెబ్బతినింది, సరిదిద్దుతా, కష్టాల్లో ఉన్న తమిళుడిని ఆదుకోవడంలో తప్పేముంది అని ప్రశ్నించారు. ‘యుద్ధం (ఎన్నికలు) వచ్చినపుడు అందరం కలుద్దాం...వెళ్లిరండి’ అంటూ రాజకీయాల్లో వస్తున్నా అనే సంకేతాలు ఇచ్చి చివరిరోజు సమావేశాన్ని ముగించారు.
అభిమానుల సమావేశాల్లో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు, విమర్శలు కలకలం సృష్టించాయి. తమిళ భాషాభిమానులు రజనీని తప్పుపట్టి బహిరంగ విమర్శలు చేశారు. పరాయి రాష్ట్రంవాళ్లు తమిళనాడును పాలించే గతి పట్టలేదని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా తమిళర్ మున్నేట్ర పడై అధ్యక్షురాలు వీరలక్ష్మి మరింత దూకుడు ప్రదర్శించి ఈనెల 22వ తేదీన రజనీ ఇంటిని ముట్టడించే యత్నం చేసి దిష్టిబొమ్మను తగలబెట్టారు.
రజనీ అభిమానుల ప్రతీకారచర్య:
రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నట్లు వ్యవహరిస్తున్న వారిపై ఆయన అభిమానులు రెచ్చిపోయారు. మంగళవారం ప్రతీకారచర్యలకు దిగారు. రజనీకి మద్దతుగా, వ్యతిరేకులను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు అంటించారు. అంతేగాక చెన్నై, మదురైలో అందోళనలు చేపట్టారు. చెన్నై వన్నార్పేట్టై– తిరువొత్తియూర్ జాతీయ రహదారిలోని తపాలాశాఖ కార్యాలయం వద్ద రజనీ అభిమానులు గుమికూడి నినాదాలు చేశారు. తమిళర్ మున్నేట్ర పడై అధ్యక్షురాలు వీరలక్ష్మి దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకుని 40 మంది రజనీ అభిమానులను అరెస్ట్ చేశారు. అలాగే మదురై పెరియార్ బస్స్టేషన్ సమీపంలో వీరలక్ష్మి దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఈ సందర్భంగా పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యతిరేకతను సహించం: అభిమాన సంఘం నేత
ఇదిలా ఉండగా, రజనీ రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదని దక్షిణ చెన్నై అభిమాన సంఘం అధ్యక్షుడు పురుషోత్తమన్ అన్నారు. రజనీ పూర్వీకులది కృష్ణగిరిజిల్లా, తన బిడ్డలకు తమిళులనే ఇచ్చి పెళ్లి చేశారు, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని ఆయన చెప్పారు. రజనీకి వ్యతిరేకంగా జరిగే పోరాటాలను ఎంతమాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
తమిళుడే పాలించాలి: దర్శకులు భారతిరాజా
తమిళనాడును తమిళుడే పాలించాలని ప్రముఖ సినీ దర్శకులు భారతిరాజా అభిప్రాయపడ్డారు. చెన్నైలో మంగళవారం జరిగిన ఒక సినీ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తమిళుడిని ఎవరెవరో పాలించాలని ఆశపడుతున్నారు, ఒక తమిళుడు మరో రాష్ట్రానికి వెళ్లి రాజకీయాలు చేయడం సాధ్యమా, మీ రాష్ట్రాన్ని నేను పాలిస్తాను అని చెప్పడానికి వీలవుతుందాని ఆయన ప్రశ్నించారు. అయితే తమిళనాడులో మాత్రం ఎవరైనా రాజకీయాలు చేయవచ్చు, రాష్ట్రాన్ని పాలిస్తాను అని చెప్పవచ్చని తెలిపారు. ఈ పరిస్థితులు మారాలి, తమిళుడు కళ్లు తెరవాల్సిన రోజులు వచ్చాయని అన్నారు. ఎవరైనా రాష్ట్రంలోకి రావచ్చు, జీవించవచ్చు అయితే ఈ భూమిని పాలించే హక్కు మాత్రం కేవలం తమిళుడికేనని ఆయన నొక్కిచెప్పారు.
ప్రజాసమస్యలు పట్టని రజనీ: దీప
సినిమారంగం నుంచి సొమ్ము చేసుకోవడం మినహా ప్రజాసమస్యలు పట్టని రజనీ రాజకీయ ప్రవేశాన్ని ప్రజలు కోరుకోవడం లేదని జయలలిత మేనకోడలు దీప వ్యాఖ్యానించారు. సినీ ప్రముఖులు రాజకీయాల్లో జయకేతనం ఎగురవేయడం ఎంజీఆర్, జయలలితకు మాత్రమే చెల్లిందని ఆమె అన్నారు.
బీజేపీలో చేరితే పెద్దపీట: కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ
రాజకీయాల్లోకి ప్రవేశించాలని రజనీ భావిస్తే బీజేపీలో చేరడమే ఉత్తమమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. ఢిల్లీలో మంగళవారం మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తమ పార్టీలో చేరితే ముఖ్యమైన పదవిని కేటాయిస్తామని, పార్టీలో పెద్దపీట వేస్తామని చెప్పారు. వచ్చే తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకి అవకాశం కల్పిస్తారా అనే ప్రశ్నకు, దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, తాను కాదని బదులిచ్చారు. కాగా, తమ పార్టీ రజనీపై ఆధారపడిలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై వ్యాఖ్యానించారు.
రజనీ ఛలో ముంబై:
రాష్ట్రంలో రాజకీయ వేడి రగిల్చిన రజనీకాంత్ తన సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళుతున్నారు. ఈనెల 28వ తేదీన ముంబైకి బయలుదేరుతున్న రజనీ నెలరోజులపాటు అక్కడే ఉంటారు. ముంబైలో తమిళులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో షూటింగ్ షెడ్యూలును ప్లాన్ చేసుకున్నారు.