వేలానికి రజనీకాంత్ ఆస్తులు!

వేలానికి రజనీకాంత్ ఆస్తులు!


సాక్షి, చెన్నై: ‘కొచ్చాడియాన్’ సినిమా నిర్మాణం కోసం తీసుకున్న అప్పు తీర్చని కారణంగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆస్తులను బ్యాంక్ వేలం వేయబోతోందనే వార్త తమిళ సినీ పరిశ్రమలో హల్‌చల్ చేస్తోంది. సినిమా నిర్మాణం కోసం ‘మీడియావన్ గ్లోబల్ ఎంటటైన్‌మెంట్’లో భాగస్వామి అయిన రజనీకాంత్ భార్య లతారజనీకాంత్ ముంబైలోని ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి దాదాపు రూ.20 కోట్లు అప్పు తీసుకున్నారు.



తమిళనాడులోని కంచీపురం జిల్లాలో ఉన్న దాదాపు 2.13 ఎకరాల్లో ఉన్న ఆస్తులను అప్పు సమయంలో షూరిటీగా పెట్టారు. తీసుకున్న అప్పుకు గడువు ఈ ఏడాది జూలై 17న ముగిసిందని, వడ్డీతో కలిపి మొత్తం రూ.22కోట్లు దాటడంతో ఆస్తులను వేలం వేస్తామని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు.



దీనిపై లతారజనీకాంత్ మాట్లాడుతూ బ్యాంక్‌కు త్వరలోనే అప్పు చెల్లిస్తామన్నారు. తన భర్తకు ఈ నోటీసుల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మార్చి 31లోగా అప్పు తీర్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు మీడియావన్ సంస్థ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top