25న రాహుల్ రాక


 చెన్నై, సాక్షి ప్రతినిధి: అఖిలభారత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెల 25వ తేదీన రాష్ట్రానికి విచ్చేయనున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుచ్చిరాపల్లికి చేరుకుంటారు. ఈ మేరకు జీ కార్నర్‌లో రాహుల్ బహిరంగ సభకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

 

 కాంగ్రెస్ ఓటు బ్యాంక్ 5 శాతం

 ఒకప్పుడు రాష్ట్రంలో ఒంటరిగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ క్రమేణా కనుమరుగైంది. 1954-63లో కామరాజనాడార్ ముఖ్యమంత్రిగా పదవీకాలం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి పూర్తిగా దూరమైంది. డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తుపెట్టుకుని ఉనికిని కాపాడుకోవాల్సి వచ్చింది. గత రెండు విడతల యూపీఏ హ యాంలో డీఎంకేతో పొత్తుపెట్టుకుని అధికారంలో భాగస్వామిగా మారింది. ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపుగా కొడిగట్టి ఉంది. కేవలం 5 శాతం ఓటు బ్యాంకుతో ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని రాహుల్ తపన పడుతున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నేతలు పదేపదే నూరిపోస్తున్నారు. టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ రాష్ట్రంలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి పాకులాడుతున్నారు. పార్టీకి సినిమా గ్లామర్‌ను జోడించేందుకు నటి కుష్బుకు అధికార ప్రతినిధి హోదానిచ్చి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గత ఏడాది తిరుచ్చిలో పర్యటించిన రాహుల్‌గాంధీ ఏడాది తరువాత మళ్లీ వస్తున్నారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన ప్రకటనలు చేయవచ్చని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top