హడలెత్తిస్తున్న సైకో
రాజరాజేశ్వరినగర్లో భయం భయం
ఎఫ్బీలో హెచ్చరికలు
బనశంకరి :
కామాంధుడు ఉమేశ్ రెడ్డి పోలికలతో ఉన్న ఓ సైకో ఇక్కడి రాజరాజేశ్వరి నగరలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఆరు నెలలుగా మహిళలను టార్గెట్ చేసుకుని అర్ధరాత్రి వేళలల్లో ఇళ్లల్లోని కిటికిల్లో నుంచి బెడ్రూమ్లు, బాత్రూమ్ దృశ్యాలను వీక్షించడం పనిగా పెట్టుకున్నాడు.
ఇది కేవలం వదంతులు కావు అంటూ ఫేస్బుక్లో రాజరాజేశ్వరీ నగర ప్రజలకు ఎదురైన అనుభవాలను పంచుకోవడం ద్వారా ఇతరులను హెచ్చరిస్తున్నారు. ‘ అందరికి హాయ్.. రాజరాజేశ్వరినగర ప్రజలకు ఓ హెచ్చరిక సందేశం. బీఈఎమ్ఎల్ 5వ స్టేజ్ న్యూహారిజన్ వద్ద సైకో ఒకరు కనబడ్డాడని, ఈ ఏరియాలో అన్ని ఇళ్లల్లోకి చొరబడ్డారని బెడ్రూమ్, వాష్రూమ్ల్లో మహిళలను చూడటం ఇతని పనిగా మారింది. అర్ధరాత్రి 11 నుంచి 2 గంటల మధ్య ఇళ్లల్లోకి చొరబడుతారని, పట్టుకోవడానికియతి్నంచినప్పటికి సాధ్యం కాలేదు. ఇతడు కాంపౌండ్ గోడల నుంచి దూకడం, పారిపోవడంలో సిద్ధహస్తుడు. ప్రమాదకరంగా మారిన ఇతని సీసీటీవీ ఫుటేజీనికూడా అటాచ్ చేశాము, మీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వండి అంటూ సందేశాలను ఎఫ్బీలో పోస్టు చేస్తున్నారు. ఈ విషయం కేవలం సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా రాజరాజేశ్వరినగర పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాత్రిసమయంలో గస్తీని పెంచి అనుమానస్పద వ్యక్తులను విచారణ చేస్తున్నారు. కాని సైకోమాత్రం మళ్లీ, మళ్లీ ఇదే ఏరియాలో కనబడి మహిళలను హడలెత్తిస్తున్నాడు. పోలీసులు ఇతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.
సంబంధిత వార్తలు