ప్రియమణి రీ ఎంట్రీ

ప్రియమణి రీ ఎంట్రీ - Sakshi


నటి ప్రియమణి కోలీవుడ్ రీ ఎంట్రీ ఖరారైంది. ఒక విభిన్న కథలో నటించడానికి ఆమె సిద్ధమవుతున్నారు. కన్గలాళ్‌ఖైదుసెయ్ చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా కోలీవుడ్‌కు పరిచయం చేసిన నటి ప్రియమణి. ఆ చిత్రం ఆమెను నిరాశ పరచినా తదుపరి నటించిన పరుత్తివీరన్ చిత్రం జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టింది. పరుత్తివీరన్ చిత్రంలో ముత్తళగిగా పల్లెపడుచు పాత్రలో ప్రియమణి జీవించారనే చెప్పాలి. ఆ తర్వాత అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రియమణి కొన్ని చిత్రాలు చేసినా ఆపై అవకాశాలు దూరమయ్యాయి.

 

 తెలుగు, మలయాళం లాంటి ఇతర భాషలపై దృష్టి సారించారు. తమిళంలో ప్రియమణి నటించిన చివరి చిత్రం రావణన్. ఈ చిత్రం మంచి ఫలితాన్నివ్వలేదు. ఆ చిత్ర హిందీ వెర్షన్‌తో బాలీవుడ్‌కు పరిచయం అయినా అక్కడా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఆ మధ్య కన్నడ అనువాదంగా తమిళంలో విడుదలైన చారులత చిత్రం మినహా ప్రియమణి నటించిన చిత్రమేదీ తమిళ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అలాంటిది చాలాకాలం తర్వాత దర్శకుడు రామ్‌కు జంటగా నటించే అవకాశం దక్కించుకున్నారు.

 

 ఈ చిత్రానికి దర్శకుడు మిష్కిన్ కథ అందించి ప్రతినాయకుడిగా నటించనుండటం విశేషం. ఆయన ఇంతకు ముందు నందలాల, ఒనాయుం ఆటుకుట్టియుం చిత్రాలలో ప్రధాన భూమిక పోషించారు. మిష్కిన్ శిష్యుడు జీ.ఇ ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం జూన్ 15న ప్రారంభం కానుంది. ఈ చిత్రంతో ప్రియమణి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top