గర్భిణికి ఆపరేషన్ చేసిన నర్సు..
- బాలింత మృతి
- బంధువుల ఆందోళన
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ గర్భిణికి నర్సు ఆపరేషన్ చేయడంతో ఆమె మృతిచెందింది. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని బిక్కనూరుకు చెందిన కోనింటి భాగ్య ప్రసవం నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీలో ఉన్న నర్సు ఆపరేషన్ చేసి కాన్పు చేసింది. సిజేరియన్ చేసిన వెంటనే భాగ్య మృతి చెందింది. ఆపరేషన్కు ముందే భాగ్య కుటుంబసభ్యులు వైద్యులు లేనందున కామారెడ్డికి రెఫర్ చేయమని సిబ్బందిని వేడుకున్నారు. అయితే అంబులెన్స్ లేదని సాకు చెప్పి నర్సు మొండిగా సిజేరియన్ చేసిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డికి రెఫర్ చేసి ఉంటే భాగ్య బతికి ఉండేదని వారు చెబుతున్నారు. భాగ్య మృతికి నర్సు నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఎదుట గందరగోళ వాతావరణం నెలకొంది.