బాలకృష్ణ ఇంటి ముందు ప్రజల పడిగాపులు
హిందూపురం అర్బన్ : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శనివారం ఉదయం నుంచి ప్రజలు వివిధ సమస్యలను తెలపడానికి పడిగాపులు కాశారు. ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యే బాలకృష్ణ పట్టణంలో పలు కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన 9 గంటలకు బయలుదేరాలి. ఇంటి వద్ద ప్రజల తాకిడి ఎక్కువైందని తెలుసుకున్న ఎమ్మెల్యే ఉదయం 8.30 గంటలకు బయటకు వచ్చి కొందరిని పలకరించి వారి వినతులు తీసుకుని పోలీసు బందోబస్తుతో బయటకు వెళ్లిపోయారు.
అడ్డువచ్చిన ప్రజలను పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టేసి బాలకృష్ణను కారెక్కించేశారు. ఎమ్మెల్యే వాహనం వెళ్లిపోగానే అక్కడి ప్రజలు నాయకులు, పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే కూడా సమస్యలు పట్టించుకోకపోతే ఎవరితో చెప్పుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వారు వెనుదిరిగిపోయారు. అలాగే ప్రారంభోత్సవాలు ఆలస్యం కావడంతో ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించాల్సిన అధికారుల సమీక్ష సమావేశం కూడా రద్దయింది. మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరులో విమానం ఎక్కాల్సి ఉండటంతో ఆయన హడావుడిగా వెళ్లిపోయారు.