ఆ హక్కు పాస్పోర్టు అధికారులకు లేదు: హైకోర్టు
ముంబై: పాస్పోర్టు కలిగి ఉన్న వ్యక్తిని విదేశాలకు వెళ్లకుండా ఆపే హక్కు పాస్పోర్టు కార్యాలయం అధికారులకు లేదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. సమీత్ రజనీ అనే వ్యక్తి కేసులో జస్టిస్ వీఎస్ కనాడే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ తీర్పు చెప్పింది. విమానంలోని సిబ్బంది బృందానికి నాయకుడైన సమీత్పై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద చిన్న చిన్న కేసులున్నాయి.
పాస్పోర్టును రెన్యువల్ చేసుకోడంతోపాటు, తాను విమానయాన సంస్థలో పనిచేస్తున్నందున తరచూ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కింది కోర్టును ఆశ్రయించారు. పాస్పోర్టు రెన్యువల్ కోసం సంబంధిత అధికారుల వద్దకు వెళ్లాలని కోర్టు ఆదేశించడంతో ఆయన పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. నిబంధనల ప్రకారం పాస్పోర్టును 10 ఏళ్లకు రెన్యువల్ చేయాలి.
సమీత్ విషయంలో కేసులు సాకుగా చూపి అధికారులు ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేశారు. దీనిపై సమీత్ హైకోర్టును ఆశ్రయించగా 10 ఏళ్లకు పాస్పోర్టును రెన్యువల్ చేయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. సమీత్ విదేశాలకు వెళ్లడాన్ని అనుమంతించాలా, లేదా అన్న విషయాన్ని కింది కోర్టుకు వదిలేసింది.