మరికాసేపట్లో అండమాన్కు 'హర్షవర్దన్'


విశాఖపట్నం : అండమాన్ వెళ్తున్న హర్షవర్దన్ నౌకలో సాంకేతిక లోపం తలెత్తి నడి సముద్రంలో నిలిచిపోవడంపై విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎం.టి. కృష్ణబాబు బుధవారం విశాఖపట్నంలో స్పందించారు. మధ్యాహ్నాం 2.00 గంటల తర్వాత ఈ నౌక అండమాన్ బయలుదేరే అవకాశం ఉందని తెలిపారు. నౌకలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరి చేసేందుకు సాంకేతిక నిపుణులను పంపుతున్నట్లు చెప్పారు. అలాగే నౌకలో ప్రయాణిస్తున్న 560 మందికి ఆహారాన్ని పంపుతున్నట్లు కృష్ణాబాబు వెల్లడించారు.



హర్షవర్దన్ నౌక దాదాపు 600 మంది ప్రయాణికులతో మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం పోర్టు నుంచి అండమాన్ బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే నౌకలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో వారు పోర్టు ట్రస్ట్ ఉన్నతాధికారులను సంప్రదించారు. నౌక నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నౌకలో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన వారని... వారంతా అండమాన్లో ఉపాధి చేసుకుంటున్న వారని సమాచారం. నౌక నడి సంద్రంలో చిక్కుకుందని తెలిసిన ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top