మద్యానికి బానిసైన కొడుకు.. తల్లి చేతిలో..
బనశంకరి(కర్ణాటక): కన్న కుమారుడి దురలవాట్లను భరించలేని ఓ మాతృమూర్తి చాకుతో పొడిచి హత్య చేసిన సంఘటన జగజీవనరామనగర పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు... జగజీవన రామనగర పరిధిలోని వీఎస్.గార్డెన్ మురికివాడలో మల్లమ్మ, తన ఇద్దరు కుమారులు రమేశ్ (22), నాగరాజ్లతో నివాసం ఉంటోంది. మల్లమ్మ కూలిపనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించేంది. ఇదిలా ఉంటే జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసైన కుమారుడు రమేశ్ను పలుమార్లు తల్లి చెడు వ్యవసనాలను మానాలని హెచ్చరించేంది. ఇది నచ్చని రమేశ్ తరచూ తల్లితో గొడవకు దిగేవాడు.
శనివారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రమేశ్ తల్లితో గొడవకు దిగాడు. తాగేందుకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిరాకరించడంతో చాకుతో పొడవడానికి యత్నించాడు. అక్కడే ఉన్న అన్న నాగారాజు అక్కడికి చేరుకుని సర్దిచెప్పడానికి యత్నించాడు. రమేశ్ మరింత రెచ్చిపోవడంతో మల్లమ్మ సహనం కోల్పోయి రమేశ్ చేతిలో ఉన్న చాకు లాక్కొని అతని రొమ్ముపై పొడిచింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న జగజీవనరామనగర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు.తల్లి మల్లమ్మ, నాగరాజ్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.