మనసు దోచిన దొంగ

మనసు దోచిన దొంగ - Sakshi


* తల్లి వైద్యం కోసం రూ. 5 లక్షల చోరీ

* రూ. 4.5 లక్షలు తిరిగిస్తూ పట్టుబడిన వైనం


చెన్నై, సాక్షి ప్రతినిధి: తన తల్లి వైద్య ఖర్చుల కోసం చోరీ చేశాడు ఓ యువకుడు(20). తీరా తల్లి చనిపోవడంతో చోరీ చేసిన సొమ్ములో కొంత మొత్తాన్ని ఖర్చుచేసి మిగిలిన డబ్బును బాధితులకు అప్పగించాడు. ఖర్చు చేసిన సొమ్ముకు బదులుగా తన మోటార్ సైకిల్‌ను వదిలి పెట్టి పరుగులంకించుకున్నాడు. వెంట బడిన స్థానికులు యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు తమిళనాడులోని పుదుక్కొట్టై పెరియార్‌నగర్‌కు చెందిన రాజమాణిక్యం(75) ప్రభుత్వ రిటైర్డు అధికారి.



ఈ నెల 24వ తేదీన బ్యాంకు నుంచి రూ.5 లక్షలు డ్రా చేసి ఇంటికి తీసుకెళ్లాడు. భార్య కాత్యాయని చేతికి డబ్బుల బ్యాగు ఇచ్చి  బయటకు వెళ్లిపోయాడు. అదే సమయంలో ఓ గుర్తు తెలియని యువకుడు బాటిల్‌తో వచ్చి తాగేందుకు నీళ్లు కావాలని ఆమెను కోరాడు. నీళ్లు తెచ్చేందుకు ఆమె లోపలికి వెళ్లగానే అక్కడున్న బ్యాగు తీసుకొని ఉడాయించాడు. కంగారుపడిన కాత్యాయని భర్తకు సమాచారం ఇచ్చి పోలీ సులకు ఫిర్యాదు చేశారు.  ఈ నెల 26వ తేదీన ఓ యువకుడు రాజమాణిక్యం ఇంటి వద్దకు వచ్చి రూ.4.5 లక్షలున్న బ్యాగును అందజేశాడు.



తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న తల్లి వైద్య ఖర్చుల కోసమే తమ ఇంట్లో చోరీకి పాల్పడ్డానని, దురదృష్టవశాత్తు తన తల్లి చనిపోయిందని వాపోయాడు. ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు పోగా మిగిలిన సొమ్మును ముట్టజెబుతున్నానని, తాను ఖర్చుపెట్టిన రూ.50 వేలకు బదులుగా తన మోటార్ సైకిల్‌ను ఇక్కడే వదిలి వెళుతున్నానని చెప్పి పారిపోబోయాడు. ఇరుగుపొరుగు వారు యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగిం చారు. విచారణలో ఆ యువకుడు తిరుచ్చిలోని ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో చదివే విరాలీమలైకి చెందిన మన్సూర్ అని గుర్తించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top