‘ఆ మంత్రిది 420 చరిత్ర’

‘ఆ మంత్రిది 420 చరిత్ర’ - Sakshi

హైదరాబాద్‌: మంత్రి జూపల్లి కృష్ణారావుపై కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. జూపల్లి సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. జూపల్లి చరిత్ర తెలిస్తే తెలంగాణ ప్రజలు ఆయన్నుఅసహ్యించుకుంటారన్నారు. లూటీలు.. నేరాలు.. ఫోర్ ట్వంటీ.. చరిత్ర జూపల్లిది అని విమర్శించారు. దేవుని మాన్యాన్ని కాజేసిన దగుల్బాజీ జూపల్లి అని ఘాటుగా విమర్శలు సంధించారు. బ్యాంకు లూటీ అంశంలో స్వంత గ్రామంలో ప్రజలు తరిమికొడితే పారిపోయి హైదరాబాద్‌కు వచ్చిన చరిత్ర, ప్రుడెన్షియల్ బ్యాంకు ముంచిన చరిత్ర జూపల్లిదన్నారు.

 

హైదరాబాద్ లో తనకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తిని హుసేన్ సాగర్లో తోసి చంపిన ఆరోపణలు జూపల్లిపై వున్నాయన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రా .. అని సవాల్‌ విసిరారు. ఖబర్దార్ జూపల్లి మర్యాద లేకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు. గతంలో కేఎల్‌ఐ కాల్వలను వెడల్పు తగ్గించి కాంట్రాక్టర్ల వద్ద లంచాలు దండుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ పాలమూరు కాల్వలను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. నీతితో కూడిన రాజకీయాలు నావి .. నీతిమాలిన రాజకీయాలు జూపల్లివి అని అన్నారు. తన జీవితం కాంగ్రెస్‌తో మొదలైందని.. కాంగ్రెస్ లోనే అంతమౌతుందన్నారు.      
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top