డబ్బులు తిరిగి అడిగినందుకు...
షాబాద్ : చేబదులుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన షాబాద్ మండలంలోని మన్మర్రి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. షాబాద్ ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని గ్రామానికి చెందిన చాకు బందయ్య(32)అతడి చిన్నాన్న కుమారుడైన శ్రీశైలంకు గత కొద్ది రోజుల క్రితం చేబదులుగా రూ. 50 వేలు ఇచ్చాడు. తీసుకున్న డబ్బులు మళ్లీ ఇవ్వాలని పలుమార్లు బందయ్య శ్రీశైలంను అడగగా దసరా పండగకు ఇస్తానని సమాధానం చెప్పారు.
దసరా పండుగ రోజున నాడబ్బులు ఇవ్వమని అడగగా పండుగపూట ఏందీరా.. నీలోల్లి అంటూ.. శ్రీశైలం గొడవకు దిగాడు. ఇరు కుటుంబాలకు చెందిన వారు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో బందయ్య కిందపడడంతో శ్రీశైలం అతనిపై బండరాయితో తలపై బాదాడు. దీంతో బందయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య బాలమణి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.