అన్న అస్థికలు కలిపేందుకు వెళ్లి..
ఈరోడ్: తమిళనాడులోని ఈ రోడులో విషాదం చోటు చేసుకుంది. సోదరుని అస్థికలు నదిలో కలిపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయాడు. తమిళనాడు రాష్ట్రం ఈ రోడ్లో ఈ ఘటన జరిగింది. సేలం జిల్లా కన్నాకురిచికి చెందిన కృష్ణన్(65) ఇటీవల మృతి చెందిన తన సోదరుని అస్థికలు కలిపేందుకు కావేరి నది ఒడ్డున ఉన్న కూడుతురైలోని భవానీ ఆలయానికి సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. చూస్తుండగానే నదిలోకి దిగి అస్థికలు కలిపే కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయన ఒక్కసారిగా నీళ్లలో మునిగి పోయాడు. గజ ఈతగాళ్లు వెంటనే రంగంలోకి దిగి వెదకగా గంట తర్వాత కృష్ణన్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.