నేపాల్ యువతి నిర్బంధం.. మూడు నెలలుగా అత్యాచారం


బెంగళూరు (కర్ణాటక) : ఉపాధి కోసం నగరానికి వచ్చిన నేపాల్ యువతిని ఓ సెక్యూరిటీ గార్డు నిర్బంధించి మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన బెంగళూరు నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. బాధితురాలు తప్పించుకుని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేశారు.



హెచ్‌ఎస్‌ఆర్ లే ఔట్ పోలీసుల కథనం మేరకు... రామ్‌సింగ్ అనే సెక్యూరిటీ గార్డు నేపాల్ రాజధాని కఠ్మాండులో తనకు తెలిసిన ఓ కుటుంబానికి చెందిన యువతిని ఉద్యోగం పేరుతో మూడు నెలల క్రితం నగరానికి పిలిపించాడు. అప్పటి నుంచి ఆ యువతిని తన గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడేవాడు. విధులకు వెళ్లే సమయంలో గదికి తాళం వేసుకుని వెళ్లేవాడు. దీంతో యువతి నిస్సహాయురాలిగా ఉండిపోయింది. అయితే.. బుధవారం రాత్రి ఇంటి నుంచి తప్పించుకుని ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది. ఆ సంస్థ కార్యదర్శి యోగేశ్ బాధితురాలికి అండగా నిలిచారు. పోలీసులు ఆ యువతి నుంచి ఫిర్యాదు తీసుకుని..వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని గురువారం అరెస్ట్ చేశారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top